దుమ్మెత్తిపోసిన నేతలు, తగ్గిన రామ్ గోపాల్ వర్మ
హైదరాబాద్: వినాయకుడి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైన కాంగ్రెస్, బీజేపీ సహా పలువురు రాజకీయ నాయకులు మండిపడ్డారు. బీజేపీ నేత షాయినా ఎన్సీ ట్విట్టర్లో వర్మ పైన ధ్వజమెత్తారు. వర్మ చేసిన వ్యాఖ్యలు దైవదూషణగా పేర్కొన్నారు. ఆయన పైన పోలీసు చర్య చేపట్టాలని కాంగ్రెసు పార్టీ మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ డిమాండ్ చేశారు.
ఓ వైపు గణేష నవరాత్రులను వైభవంగా నిర్వహించుకుంటుంటే.. రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేయడమం మన సాంస్కృతిక, మత విలువలను దారుణంగా అవమానించడమేమిటని శివసేన ఎంపీ ప్రేమ్ శుక్లా మండిపడ్డారు.
వర్మ పైన దేశంలో పలుచోట్ల ఫిర్యాదులు అందాయి. కేసులు నమోదయ్యాయి. హిందూ జన జాగృతి సమితి సభ్యుడు సుర్జీత్ మాథుర్ పనాజీలోని పొండా పోలీసు స్టేషన్లో వర్మ పైన ఫిర్యాదు చేశారు. ఔరంగాబాదులో క్రాంతి చౌక్ పోలీసు స్టేషన్లో కూడా వర్మ పైన ఫిర్యాదు దాఖలైంది. ఔరంగాబాద్ నగర మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన సారథి సుమిత్ కంబేకర్ ఈ ఫిర్యాదు దాఖలు చేశారు.
వినాయకుడిపై అభ్యంతరక వ్యాఖ్యలు చేశారంటూ రాంగోపాల్ వర్మపై హైదరాబాద్ చంపాపేట్కు చెందిన న్యాయవాది కరుణసాగర్ సరూర్నగర్ పోలీసుస్టేషన్లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వినాయకుడిపై వర్మ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై భాగ్య నగర్ గణేష్ ఉత్సవ కమిటీ (హైదరాబాద్ నగర ఉత్సవ కమిటీ) నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. భక్తుల మనో భావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన రామ్ గోపాల్ వర్మపై కఠినమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని తమ ఫిర్యాదులో కోరారు. వర్మ వ్యాఖ్యలను అన్ని పార్టీలు ఖండించడమే కాకుండా.. హైదరాబాద్, గోవా, విజయవాడ, ఔరంగాబాద్ తదితర పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు అందాయి.
మరోవైపు, వినాయకుడి పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సర్వత్రా నిరసనలు, కేసులు వెల్లువెత్తాయి. దీంతో వర్మ క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమాపణ చెబుతున్నట్లు మరో కామెంట్ చేశాడు. తన ఉద్దేశ్యం గణేశుడిని అవమానించడం కాదని, ఎవరినీ నొప్పించాలన్నది తన అభిమతం కానేకాదని, ఎవరికైనా మనసు కష్టం కలిసి ఉంటే మనస్ఫూర్తిగా క్షమించాలని కోరారు.