వెంకయ్య నాయుడికి చేదు: స్మార్ట్ సిటీలో స్మార్ట్ చోరీ
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడికి విచిత్రమైన అనుభవం ఎదురైంది. పాస్పోర్టు ఉన్న ఆయన బ్యాగ్ చోరీకి గురైంది. ‘స్మార్ట్ సిటీ ఎక్స్పో వరల్డ్ కాంగ్రెస్'ను ప్రారంభించేందుకు బార్సిలోనా (స్పెయిన్)కు వెళ్లిన ఆయనకు అక్కడ చోరీలు సైతం ఎంత స్మార్ట్గా జరుగుతాయో అనుభవంలోకి వచ్చింది. ప్రపంచంలోని ఉత్తమ స్మార్ట్ సిటీగా బార్సిలోనాను అభివృద్ధిపరచినందుకు అభినందనలు, ఢిల్లీని కూడా ఇలా అభివృద్ధి చేసేందుకు మీ సాంకేతిక సహకారం అవసరమని ఆ నగర మేయర్ను ప్రశంసల్లో ముంచెత్తిన మర్నాడే హోటల్ లాబీలో ఎవరో దొంగ ఆయన బ్యాగ్ను ఎత్తుకెళ్లారు.
మీడియాలో వచ్చిన కథనాలు ఇలా ఉన్నాయి - బార్సిలోనాలో స్మార్ట్ సిటీ ఎక్స్పోలో పాల్గొన్న వెంకయ్యనాయుడు బుధవారం స్వదేశానికి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో చూసే సరికి తన బ్యాగ్ లేదని అర్థమైంది. అందులో వెంకయ్యపాస్పోర్టుతో పాటు, ఆయన ఓఎస్డీ సత్య పాస్పోర్టు, ఐడీ, పాన్, క్రెడిట్ కార్డులు, పెద్ద మొత్తంలో నగదు కూడా ఉన్నాయి. సత్య ఐఫోన్ 6, ఎంఎస్ సర్ఫేస్ ప్రో3 కూడా ఉన్నాయి. బ్యాగు పోయిన విషయం తెలిసినప్పటికీ అక్కడి రాయబారి విక్రం మిశ్రా స్పందించలేదు.
ఢిల్లీ నుంచి ఒత్తిడి రావడంతో ఆగమేఘాలపై దొంగ కోసం అన్వేషణ ప్రారంభించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి వెంకయ్యనాయుడి పాస్పోర్టు చోరీ జరిగిన హోటల్కు కొద్దిదూరంలో రోడ్డుపై పడి ఉండటం కనిపించింది. అది దౌత్య హోదా ఉన్న పాస్పోర్టు కావడంతో ఆ దొంగ భయపడి ఉంటాడని, ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో వదిలేసి ఉంటాడని భావిస్తున్నారు.
సత్య పాస్పోర్టు దొరకకపోవడంతో మన రాయబారి అప్పటికప్పుడు డూప్లికేట్ పాస్పోర్టు తయారుచేయించి ఆయనను కేంద్ర మంత్రితో పాటు సురక్షితంగా భారత్కు పంపారు. ఎట్టకేలకు గురువారం ఉదయం వెంకయ్యనాయుడు, ఆయన ప్రతినిధి వర్గం ఢిల్లీకి చేరుకున్నారు.
ఈ చోరీ విషయమై వెంకయ్యనాయుడు ట్విటర్ ఖాతాలో రెండు ట్వీట్లు రావడంతో ప్రపంచానికి దీని గురించి తెలిసింది. ‘ఇది ఒక విచిత్ర దేశంలా కనపడుతోంది. ఎవరో నా బ్యాగును దొంగిలించారు' ట్వీట్ చేశారు. అయితే, ఈ విషయమై మంత్రి స్వయంగా ట్వీట్ చేయడం ప్రొటోకాల్కు విరుద్ధమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
వెంకయ్య ట్విటర్ ఖాతాను నిర్వహించే ఒక అధికారి ఈ ట్వీట్లను చేసినట్టు సమాచారం. దీనిపై అభ్యంతరాలు వస్తుండడంతో గురువారం సాయంత్రానికి తొలగించారు. ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే ఓఎస్డీ సత్య సైతం ఈ విషయాన్ని ఫేస్బుక్లో పెట్టారు.