బాబు క్షమాపణ: పవన్ కళ్యాణ్ను చల్లార్చడానికేనా..
హైదరాబాద్: కొందరిని స్వయంగా ఆహ్వానించలేకపోయినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పడంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను చల్లార్చడానికే ఆయన క్షమాపణ చెప్పినట్లు భావిస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి కొందరిని స్వయంగా పిలవలేకపోయానని, అందువల్ల వారికి క్షమాపణ చెబుతున్నానని ఏపీ సీఏం చంద్రబాబు అన్నారు.
వేదికపై ఉప ముఖ్యమంత్రులకు అవకాశం ఇవ్వలేకపోయామని శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రులను వేదికపై ఆహ్వానించకపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేయడాన్ని అటుంచితే స్వయంగా ఆహ్వానించలేకపోయినందుకు క్షమాపణ చెప్పాల్సినంత అవసరం చంద్రబాబుకు ఎందుకు వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది.

మంత్రులు అయ్యన్నపాత్రుడు, కామినేని శ్రీనివాస్ వెళ్లి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు అమరావతి శంకుస్థాపన ఆహ్వాన పత్రాన్ని అందించారు. అయితే, అప్పుడే పవన్ కళ్యాణ్ కాస్తా అనాసక్తి ప్రదర్శించినట్లు అనిపించింది. అందుకే, చంద్రబాబు స్వయంగా రాకపోవడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే, ప్రోటోకాల్ సమస్య ఉంటుందని పవన్ కళ్యాణ్ సర్దిచెప్పే ధోరణిలో అన్నారు.
కానీ, అమరావతి శంకుస్థాపనకు వెళ్లకూడదని పవన్ కళ్యాణ్ అప్పుడే నిర్ణయించుకున్నట్లు దాదాపుగా అందరికీ అర్థమైంది. తాను గుజరాత్ షూటింగ్ నిమిత్తం వెళ్తున్నానని, వీలైతే శంకుస్థాపనకు వెళ్తానని ఆయన చెప్పారు. చెప్పినట్లుగానే ఆయన షూటింగ్కు వెళ్లారు. కానీ, అనుకుంటే పవన్ కళ్యాణ్ వీలు చేసుకుని వచ్చి ఉండేవారని అంటున్నారు.
ఈనాడు అధినేత రామోజీ రావును స్వయంగా వెళ్లి ఆహ్వానించిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ను కలవకపోవడంపై జనసేన కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తన నివాసానికి వచ్చిన చంద్రబాబు అమరావతి శంకుస్థాపనకు పిలువడానికి రాకపోవడంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందుకే, ఆయన అసంతృప్తిని తగ్గించాడనికి చంద్రబాబు మీడియా ప్రతినిధుల సమావేశంలో క్షమాపణ చెప్పినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications