ప్రపంచ తెలుగు మహాసభలు: బాబుకు మరోసారి కెసిఆర్ షాక్
అమరావతి: అమెరికా అధ్యక్షుడు ఇవాంక ట్రంప్ హైదరాబాదు పర్యటనకే కాకుండా హైదరాబాదు మెట్రో రైలు ప్రారంభానికి కూడా తనను ఆహ్వానించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనసు నొచ్చుకున్నట్లే కనిపించారు.
మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చంద్రబాబును నొచ్చుకునే పని చేయబోతున్నట్లు సమాచారం. ప్రపంచ తెలుగు మహాసభ ప్రారంభ కార్యక్రమానికి ఆయనకు ఇప్పటి వరకు అహ్వానం పంపించలేదని సమాచారం. ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం హైదరాబాదులో అట్టహాసంగా ప్రారంభం కాబోతున్నాయి.

ఎల్బీ స్టేడియంలో ప్రారంభ సదస్సు..
హైదరాబాదులోని లాల్ బహుదూర్ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ సదస్సు శుక్రవారం జరగనుంది. ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖులు, తెలుగుభాషా పిపాసులు హాజరవుతున్నారు.. అయితే, మహాసభలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రారంభ వేడుకకు ఆహ్వానించే అవకాశం లేదని అర్థమవుతోంది.

కడియం ఆలా చెప్పారు గానీ...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఆహ్వానిస్తామని ఇటీవల తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. అయితే, ప్రపంచ తెలుగు మహాసభల తొలిరోజు వేడుక ప్రారంభోత్సవ ఆహ్వానపత్రికలో మాత్రం ఎక్కడా చంద్రబాబునాయుడు పేరు కనిపించడం లేదు.

ప్రారంభ సదస్సులో వీరు..
ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు, సభాధ్యక్షులుగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ సదస్సుకు విశిష్ట అతిథులుగా హాజరవుతున్నారు. అయితే, చంద్రబాబుకు మాత్రం ఆహ్వానం లేదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సీఎంఓ అధికారులు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం రాలేదని అంటున్నారు. దీన్నిబట్టి, ఏపీ సీఎం చంద్రబాబుకు మహాసభల తొలిరోజు పండుగకు ఆహ్వానం లేదని స్పష్టమవుతోంది.

కెసిఆర్ మనసు మార్చుకున్నారు..
మహాసభల తొలిరోజు వేడుకకు బాబునూ ఆహ్వానించాలని తొలుత అనుకున్నారు. అయితే, ఎందుకో తెలంగాణ ముఖ్యమంత్రి మనసు మారిందని అంటున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవానికి చంద్రబాబుకు ఆహ్వానం పంపించకుండా, ప్రధానికే పరిమితం చేశారు. కెసిఆర్తో పాటు తెలంగాణ మంత్రులు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుతోనూ ఎపి మంత్రులూ టిడిపి నేతలతోనూ వ్యక్తిగత సంబంధాలు మాత్రం కొనసాగిస్ున్నారు. అయితేచంద్రబాబును మాత్రం ప్రతిష్ఠాత్మకమైన కార్యక్రమాలకు కేసీఆర్ ప్రభుత్వం ఆహ్వానించకపోవడంపై మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ముగింపు వేడుకకు ఆహ్వానం?
మహాసభల ముగింపు వేడుకకు చంద్రబాబునాయుడుని ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిర్ణయించినట్లు సమాచారం. ముగింపు సమావేశానికి రాష్ట్రపతి కోవింద్ వస్తున్నారు. దానికి చంద్రబాబును ఆహ్వానించే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications