మారిన జగన్ వ్యూహం: తెలంగాణకు తల్లీబిడ్డలు
హైదరాబాద్: కుటుంబ సభ్యులను దూరంగా ఉంచుతున్నారనే అపవాదు నుంచి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బయటపడడానికి చర్యలు తీసుకున్నట్లు అర్థమవుతోంది. జైలు నుంచి బయటకు రాగానే తల్లి వైయస్ విజయమ్మను, సోదరి షర్మిలను, వైవి సుబ్బారెడ్డిని పక్కన పెట్టినట్లు వార్తలు వచ్చాయి. పార్టీలో కుటుంబ సభ్యులే ఉన్నారనే విమర్శలు వస్తాయని వారందరినీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంచాలని జగన్ మొదట అనుకున్నారు. కానీ, ఇప్పుడు వారికి ఎన్నికల్లో పోటీకి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది.
అయితే, తల్లి వైయస్ విజయమ్మ, సోదరి షర్మిలకు అతి కష్టమైన బాధ్యతను అప్పగించారు. తెలంగాణలో ప్రచారం చేయాలని వారికి ఆయన సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి పోటీ చేయాలని వారికి చెప్పినట్లు కూడా తెలుస్తోంది. తాను జైలులో ఉన్నప్పుడు పార్టీని నడిపించిన వైవి సుబ్బారెడ్డి మాత్రం ఇంకా అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖపట్నం పార్లమెంటు సీటుకు పోటీ చేయాలని జగన్ చెబుతుండగా, సుబ్బారెడ్డి ఒంగోలు సీటు కోరుకుంటున్నారు. ఒంగోలు సీటులో పోటీ చేస్తే విజయం సులభమవుతుందనేది సుబ్బారెడ్డి అభిప్రాయం. కుటుంబం నుంచి ఎన్నికల్లో ఒక్కరే నిలబడాలనే నిర్ణయం తీసుకుని షర్మిలను, విజయమ్మను జగన్ పక్కన పెట్టారు. అయితే, రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని భావించి జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెలంగాణలో పోటీ చేయడానికి విజయమ్మకు, షర్మిలకు జగన్ అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు. ప్రస్తుత తరుణంలో షర్మిల మల్కాజిగిరి పార్లమెంటు సీటు నుంచి గానీ నల్లగొండ జిల్లాలోని శాసనసభ సీటు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కాగా, విజయమ్మ ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని అంటున్నారు.
కాగా, వైయస్ విజయమ్మ కర్నూలు జిల్లాలో ప్రచారాన్ని ముగించిన తర్వాత తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో ఈ నెల 24వ తేదీ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని, ప్రకాశం జిల్లాలో ప్రచారం ముగించి, షర్మిల ఈ నెల 22వ తేదీన నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారని అంటున్నారు.