పొదుపు: జగన్ ఇంటికి పార్టీ కార్యాలయం
హైదరాబాద్: వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పొదుపు చర్యలను చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత జగన్ తన పార్టీ వ్యవహారాలకు అయ్యే ఖర్చును తగ్గించే ప్రయత్నంలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా హైదరాబాదులోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
పార్టీ కార్యాలయాన్ని తన నివాసంలోనే ఏర్పాటు చేసుకోవాలని ఆయన భావించినట్లు చెబుతున్నారు. ప్రస్తుత కార్యాలయం అద్దెకు, నిర్వహణకు దాదాపు కోటి రూపాయలు ఖర్చవుతున్నట్లు చెబుతున్నారు. లోటస్ పాండ్లో ఓ భవనం ఖాళీగా ఉందని, అందులోకి పార్టీ కార్యాలయం మారుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో నిర్ణయమైన తర్వాత రాజధాని ఏర్పాటయ్యే ప్రాంతానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీ కార్యాలయం మారుతుంది. తమకు పార్టీకి ఎపి కేంద్ర కార్యాలయం కావాలని, తాము ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మీదనే దృష్టి కేంద్రీకరిస్తున్నామని పార్టీ నాయకులు అంటున్నారు.
తెలంగాణలో కూడా పార్టీ ఉంటుంది కాబట్టి ప్రధాన కార్యాలయం హైదరాబాదులో ఉంటుందా, లేదా అనేది తేలడం లేదు.