కెసిఆర్తో ఢీ, టిడిపి ఖతమ్: 'సైకిల్'కు జగన్ పార్టీ షాక్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. మెదక్ లోకసభ ఉప ఎన్నిక మొదలు.. నేడు వరంగల్, ఖమ్మం కార్పోరేషన్, అచ్చంపేట నగర పంచాయతీ ఎన్నికల వరకు కారు జోరు కొనసాగిస్తోంది.
తాజాగా, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్లను దక్కించుకుంది. అచ్చంపేటలో క్లీన్ స్వీప్ చేసింది. మెదక్ ఉప ఎన్నిక, వరంగల్ ఉప ఎన్నిక, నారాయణఖేడ్ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, తాజా ఎన్నికలు... ఎక్కడ కూడా తెరాస వెనుదిరిగి చూసుకోవడం లేదు.
పైగా టిఆర్ఎస్కు ప్రజల మద్దతు అంతకంతకు పెరుగుతోంది. వరంగల్ ఉప ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో కంటే మెజార్టీ వచ్చింది. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో సానుభూతిని పక్కన పెట్టి ప్రజలు తెరాసకు ఓటు వేశారు. ఇప్పుడు వరంగల్, ఖమ్మం, అచ్చంపేటలో ఘన విజయం సాధించింది.
అచ్చంపేటలో కాంగ్రెస్, బిజెపి, టిడిపిలు ఐక్య కూటమిగా పోటీ చేశాయి. అయినప్పటికీ కనీసం ఒక్క స్థానం గెలుచుకోలేకపోయాయి. ఇరవై స్థానాలకు ఇరవై స్థానాలనూ కారు దక్కించుకుంది. అన్ని పార్టీలు కలిసి కూడా అధికార పార్టీని ఢీకొట్టలేకపోయాయి.
వరంగల్ కార్పోరేషన్లో 58 స్థానాలు ఉన్నాయి. ఇందులో మెజార్టీ సీట్లు టిఆర్ఎస్ గెలుచుకొని కార్పోరేషన్ దక్కించుకుంది. కాంగ్రెస్, లెఫ్ట్ ఒకటి రెండు సీట్లు గెలుచుకొని ఊరట చెందాయి. అయితే, తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పిన బిజెపి, టిడిపిలు మాత్రం ఒక్క సీటునూ గెలుచుకోలేకపోయాయి.
ఖమ్మం జిల్లాలో టిడిపికి మొదటి నుంచి మంచి పట్టు ఉంది. నామా నాగేశ్వర రావు, తుమ్మల నాగేశ్వర రావు వంటి నేతలు పార్టీలో ఉన్నారు. అయితే తుమ్మల తెరాసలో చేరడం, నామా సైలెంట్ కావడం.. వైసిపి నుంచి కీలక నేతలు ఎదగడంతో ఖమ్మం జిల్లాలో టిడిపి స్థానాన్ని ఒకవిధంగా వైసిపి కైవసం చేసుకుంది.
ఖమ్మం కార్పోరేషన్ను కూడా అధికార టిఆర్ఎస్ గెలుచుకుంది. 50 స్థానాలకు గాను మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. వైసిపి, లెఫ్ట్ పార్టీలు సింగిల్ డిపాజిట్కే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం డబుల్ డిపాజిట్ సాధించి సత్తా చాటింది. అయితే, ఖమ్మంలో ఒకవిధంగా టిడిపి కంటే వైసిపి తన సత్తా చాటింది. టిడిపి ఒక్కచోటా గెలవలేదు. వైసిపి మాత్రం రెండు స్థానాలు దక్కించుకుంది.
తెలంగాణలో 2019 నాటికి సత్తా చాటుతామని, టిఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న బిజెపి, టిడిపిలు వరుసగా ఎన్నికల్లో చతికిలపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పరువు కాపాడుకుంటుంది. ఇప్పుడు ఖమ్మంలో వైసిపి సీట్లు దక్కించుకోవడం, టిడిపి ఒక్కటీ గెలవకపోవడం ద్వారా.. తెలంగాణలో వైసిపి కూడా సైకిల్ పార్టీని దాటేసి షాకిచ్చిందని చెప్పవచ్చు. మొత్తానికి, కెసిఆర్ ధాటికి విపక్షాలు మాత్రం విలవిల్లాడుతున్నాయి.