జగన్పై సొంతఎమ్మెల్యేల అసహనం, బాబుకు మద్దతు
హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు పొడసూపినట్లుగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం 'పట్టీసీమ' నిర్ణయానికి విపక్షంలోని పలువురు ప్రజాప్రతినిధులు మద్దతు పలుకుతున్నారు.
పట్టిసీమ ప్రాజెక్టును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అయితే, తాము పట్టిసీమకు వ్యతిరేకం కాదని, దీని పేరుతో పోలవరం ప్రాజెక్టును పక్కన పెడతారనే తమ ఆందోళన అని జగన్ చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుకు పలువురు వైసీపీ నేతల నుండి మద్దతు లభిస్తోంది. పట్టిసీమ ప్రాజెక్టును వ్యతిరేకించడంపై రాయలసీమ నేతలు అధినేత పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

సీఎం చంద్రబాబు సీమకు నీరివ్వాలని చూడటం వాస్తవమేనని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. పట్టిసీమతో రాయలసీమకు మేలు జరుగుతుందన్నారు. ఆయనతో పాటు పలువురు రాయలసీమ వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ తీరు పైన అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో పట్టిసీమ పైన తెలుగుదేశం పార్టీలో మాత్రం ఏకగళం వినిపిస్తోందని చెప్పవచ్చు. ఇటు రాయలసీమ, అటు గోదావరి జిల్లాల నేతలు దాదాపు ఒకే మాటపై ఉన్నారని చెప్పవచ్చు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టిసీమ పైన రాయలసీమకు మేలు జరుగుతుంద్నారు. ఈ ప్రాజెక్టు పైన చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారని చెప్పారు.
గోదావరి జిల్లాలకు చెందిన మరో నేత ఆనంద రావు మాట్లాడుతూ.. పట్టిసీమను గోదావరి జిల్లాల ప్రజలు వ్యతిరేకించడం లేదని చెప్పారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీరు రాయలసీమకు వెళ్తే మాకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. పట్టిసీమ టెండర్లలో ఎలాంటి అవకతవకలు లేవని చెప్పారు. మరోవైపు, మాజీ మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ.. పట్టిసీమతో గోదావరి జిల్లాలకు నష్టమని, తమ ప్రాంత ప్రయోజనాలు ముఖ్యమని చెప్పారు.












Click it and Unblock the Notifications