స్టార్ బ్యాట్స్మన్: జగన్ పార్టీ టార్గెట్ కిరణ్ రెడ్డే
హైదరాబాద్: స్టార్ బ్యాట్స్మన్ అంటూ, సమైక్యాంధ్ర చాంపియన్ అంటూ పిలిపించుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం సీమాంధ్ర నాయకులు కలిసి సమరం సాగిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులు కూడా ఆయననే లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ రకంగా సీమాంధ్రలో సమైక్యాంధ్ర చాంపియన్గా నిలబడాలనే కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాన్ని దెబ్బ తీసే ప్రయత్నాలు చేస్తున్నాయి.
స్టార్ బ్యాట్మెన్నని, బిల్లును అడ్డుకుంటానని అన్నారు, చివరకు ఇదా చేసింది అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు, టిడిపి సీమాంధ్ర ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లును కనీసం ప్రతిఘటించడానికి ముఖ్యమంత్రి ప్రయత్నించడం లేదని బిఎసి సమావేశం తరువాత అసెంబ్లీ ఆవరణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సీమాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ను ప్రస్తావిస్తూ కిరణ్ను స్టార్ బ్యాట్స్మెన్ అన్నది ఆయనే కదా, రాజకీయాల్లో అంతా బఫూన్లు తయారయ్యారని శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. ముసాయిదా బిల్లు రాష్ట్రానికి రావడానికి ముందు అడ్డుకుంటాని ప్రగల్భాలు పలికిన నాయకులు ఒక్కరూ ఇప్పుడు మాట్లాడడం లేదని విమర్శించారు.

బిల్లు సభకు వచ్చే రోజు పది లక్షల మందితో అసెంబ్లీని ముట్టడిస్తామని ఎపి ఎన్జివో నాయకుడు, సమైక్యాంధ్ర ఉద్యమ వీరునిగా ప్రచారం చేసుకున్న అశోక్బాబు ఏమయ్యాడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు ప్రశ్నించారు. అశోక్ బాబు వెనక కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో అశోక్ బాబును కూడా లక్ష్యం చేసుకుని ఆ పార్టీ వ్యూహరచన చేసి అమలు చేస్తోంది. అంతా ముందుగా అనుకున్నట్టే చేస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ హైకమాండ్తో కుమ్మక్కు అయి వారు చెప్పినట్టు చేస్తున్నారని విమర్శించారు.
బిఎసి సమావేశంలో టిడిపి ఎమ్మెల్యే గాలి ముద్దు కృష్ణమనాయుడు ఇదే విషయాన్ని సున్నితంగా ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు. ఐదున్నర కోట్ల మంది సీమాంధ్ర ప్రజలు, సీమాంధ్ర ఎమ్మెల్యేలంతా మీవైపే ఆశగా చూస్తున్నారు, మీరే చర్చ జరగాలని మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. బిల్లును ఆపేస్తానని అన్నారు, ఇప్పుడేమో చర్చ జరగాలని మీరే అంటున్నారని గుర్తు చేస్తూ ఇదేమిటని గాలి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. "నాది ఎప్పుడూ ఒకే అభిప్రాయం, అప్పుడు ఇప్పుడు అదే చెబుతున్నాను, సభలో కూడా సమైక్యాంధ్ర ఆవసరంపై నా అభిప్రాయం నేను చెబుతాను" అని ముఖ్యమంత్రి బదులిచ్చారు.
అంతా పథకం ప్రకారమే నడుచుకుంటున్నారని, సీమాంధ్రులను మోసం చేస్తున్నారని సీమాంధ్ర టిడిపి నాయకులు విమర్శించారు. ముఖ్యమంత్రి పాత్ర అనుమానాస్పదంగా ఉందని, ఇంకా తమను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ముఖ్యమంత్రికి లేదా? అని దూళిపాల ప్రశ్నించారు. మొత్తం మీద, అటు వైయస్సార్ కాంగ్రెసు, ఇటు తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు ముఖ్యమంత్రిని లక్ష్యం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications