Telangana Liberation day:నిజాం రజాకార్ల నిరంకుశ పాలన నుంచి విముక్తి ఎలా కలిగింది..?
1947 ఆగష్టు 15... అఖండ భారతావనికి స్వాంతంత్ర్యం సిద్ధించిన రోజు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తెల్లదొరల పాలన నుంచి విముక్తి పొందాయి కానీ నాటి హైదరాబాదు రాష్ట్రం మాత్రం నిరంకుశ నిజాం పాలన కిందే ఇంకా మగ్గిపోయింది. స్వాతంత్ర్యం సిద్ధించాక కూడా మరో 13 నెలల పాటు హైదరాబాదు రాష్ట్రంలో నిజాంలదే ఆధిపత్యంగా నిలిచింది. ఈ క్రమంలోనే అప్పటి తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో పేరుతో పోలీసు చర్య ద్వారా హైదరాబాద్ రాష్ట్రంను భారత్లోకి విలీనం అయ్యేలా చొరవచూపారు. దీంతో నిజాం పాలకులు సెప్టెంబర్ 17, 1948లో హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్కు అప్పగించారు. అందుకే సెప్టెంబర్ 17ను ఏటా తెలంగాణ విమాచనా దినోత్సవంగా జరుపుకుంటాం.
కర్నాటక మహారాష్ట్రలో కూడా ...
సెప్టెంబర్ 17వ తేదీన మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు నిజాం పాలన కిందే ఉండేవి. ఈ ప్రాంతాల నుంచి విముక్తి కలిగించేందుకు స్వామి రామానంద్ తీర్థ్, గోవింద్ భాయ్ ష్రాఫ్, విజయంత్ర కాబ్రా, పీహెచ్ పట్వార్ధన్తో పాటు ఇతరులు కూడా మరఠ్వాడ ప్రాంత విముక్తి కోసం నిజాంలపై పోరాటం చేశారు. నిజాం మరియు రజాకార్లు ఆకృత్యాలకు, హింసకు ఎదురొడ్డి నిలిచినట్లు చరిత్ర చెబుతోంది. ఇక కర్నాటక రాష్ట్రం కూడా హైదరబాద్ పాలిత కర్నాటక విమోచన దినోత్సవంను ఈ రోజు జరుపుకుటుంది. కర్నాటక ఈశాన్య జిల్లాలైన బీదర్, కాలబురిగి, రాయ్చూర్ ప్రాంతాలు అప్పటి హైదరాబాదు రాష్ట్రంలో ఉండేవి. వీటిపై కూడా నిజాంల ఆధిపత్యం కొనసాగింది.
కొమురం భీమ్, చాకలి ఐలమ్మలాంటి వారెందరో
ఇక తెలంగాణ మొత్తం నిజాం పాలకుల కిందే ఉండేది. అయితే నిజాం పాలకులపై అత్యంత సాహసాలు ప్రదర్శించి నిజాంల ఆకృత్యాలను ఎదిరించి తమ ప్రాంత స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన ఎందరో మహానుభావులను మాత్రం ఈ రోజు మరిచిపోతున్నాము. వారి త్యాగాలకు తగిన గుర్తింపు దక్కలేదు. వీరిలో కొమరం భీమ్, పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, షోయబుల్లా ఖాన్, వందేమాతరం రామచంద్రరావు, నారాయణరావు పవార్, చాకలి ఐలమ్మ లాంటి ఎందు మహనీయులు నాడు తమ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడారు. తరాలా మారుతున్న క్రమంలో వీరి పోరాట స్మృతులు కూడా కనుమరుగవుతున్నాయి. వీరి చరిత్ర గురించి పాఠ్య పుస్తకాల్లో చేర్చకుంటే ఇక ఈ మహానుభావుల త్యాగం మరించేందుకు ఎంతో కాలం పట్టదు.
నిజాంలకు అండగా నిలిచిన రజాకార్లు
ఇక తెలంగాణ నిజాం నిరంకుశ పాలనతో అల్లాడిపోగా ఆ తర్వాత రజాకార్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. దీనికి నేతృత్వం వహించాడు ఖాసిం రిజ్వీ. హైదరాబాదు డెక్కన్ ప్రాంతాన్ని స్వంతంత్ర ఇస్లాం రాజ్యంగా ఏర్పాటు చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే నిజాంలకు 1,50,000 మంది ఎంఐఎం వాలంటీర్లను అందించాడు. అప్పటికే నిజాంలకు చెందిన 24వేల మంది సైన్యంకు అదనంగా ఈ 1,50,000 మంది రిజ్వీ సైన్యం మద్దతుగా నిలిచారు. వీరే ఆ తర్వాత రజాకార్లుగా పిలువబడ్డారు. ఇక తెలంగాణలో రజాకార్ల ఆకృత్యాలకు అంతే లేకుండాపోయింది. ప్రతి పల్లెలో వారి దమనకాండ కొనసాగింది. మహిళలను, యువతులపై అత్యాచారాలు, మగవారి ఊచకోత, కనిపించిందల్లా ధ్వంసం చేయడం ఇలా వారి ఆకృత్యాలకు అంతే లేకుండా పోయింది. ఇక రజాకార్లను ఎదురించిన వారిలో ఒక ముస్లిం జర్నలిస్టు ఉన్నారు. ఆయనే షోయబుల్లాఖాన్. భారత్లో హైదరాబాద్ను విలీనం చేయాలన్న డిమాండ్తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్న క్రమంలో రజాకార్ల ఆగ్రహానికి గురికావడంతో షోయబుల్లాఖాన్ను అంతమొందించారు.
అంతులేని రజాకార్ల ఆకృత్యాలు
రజాకార్ల హింసకు బలైంది మాత్రం అన్ని వర్గాలకు చెందిన నాటి సామాన్య తెలంగాణ పౌరులు మాత్రమే. వరంగల్లోని చిన్న గ్రామం భైరాన్పల్లిలో చాలామంది రజాకార్ల తూటాలకు బలయ్యారు. కరీంనగర్కు వెళ్లాల్సి ఉన్న రజాకార్లను వారి బైరాన్పల్లి గ్రామస్తులు అడ్డుకోవడంతో రజాకార్లు వారిపై బుల్లెట్ల వర్షం కురిపించారు. మహిళలపై మానభంగాలకు పాల్పడ్డారు. మగవారిని వరుసగా నిలబెట్టి వారిపై కాల్పులు జరిపారు. గ్రామంలోని ప్రతి ఇంట్లోకి చొరబడి దోచుకుని ధ్వసం చేశారు. పరకాలలోని రైతులు కూడా నిజాంలను రజాకార్లను ఎదిరించారు. అయితే 1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న వార్త వరంగల్ ఆ చుట్టుపక్కల గ్రామాలకు తెలియడంతో వారంతా త్రివర్ణ జెండాను ఎగురవేసి సంబురాలు చేసుకోవాలని తలచారు. అయితే రజాకార్లు రంగంలోకి దిగి ప్రజలపై లాఠీ చార్జి చేశారు. రంగపురం గ్రామంలో ముగ్గురిని చెట్టుకు కట్టేసి కర్కశంగా కాల్చి చంపారు. లక్ష్మీపురం మహిళలపై అత్యాచారం చేసి ఆ గ్రామాన్ని రజాకార్లు దోచుకున్నారు. లక్ష్మీపురం మరియు రంగపురం గ్రామాలను దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దక్షణ భారతదేశ జలియన్వాలాబాగ్గా అభివర్ణించారు.
Recommended Video
ఎన్నో ఘట్టాలకు సాక్ష్యంగా భరతభూమి
ఎన్నో చారిత్రక ఘట్టాలకు భరతభూమి సాక్ష్యంగా నిలిచింది. భారతదేశం ఈ రోజు ఇలా ఉందంటే అందుకు కారణం నాటి ప్రాణత్యాగాలే. భవిష్యత్ తరాలకు ఆ మహనీయుల గురించి వారి ప్రాణత్యాగాల గురించి చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. చరిత్రను కప్పిపెట్టడం, కఠిక నిజాలను దాచడంవల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. అందుకే సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారిక పండుగ కింద జరుపుకోవాలి. తెలంగాణ విముక్తి కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన వారి జ్ఞపకార్థం ఒక మెమోరియల్ను ఏర్పాటు చేసి వారి సాహసాలను ప్రస్తత తరం భవిష్యత్ తరం వారికి తెలిసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.