Jaladi.. జానపద జాబిలి..!!
అమరావతి: జాలాది రాజారావు.. ఇంటిపేరు జాలాదితో సుప్రసిద్ధుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరస్మరణీయుడు. కవి, సినీ గేయ రచయిత. పండితులకే కాదు..పామరులకు సైతం ఇట్టే అర్థం అయ్యే రచనలు ఆయన సొంతం. అలవోకగా పాడుకోవడానికి పల్లె పదాలతో పాటలను గుది గుచ్చిన కవి. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో తన పాటలతో ఉత్తేజితులను చేశారు.
1932 ఆగస్ట్ 9వ తేదీన అప్పటి కృష్ణాజిల్లా దొండపాడులో జన్మించారు. తల్లిదండ్రులు అమృతమ్మ,ఇమాన్యుయేల్. సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు జాలాది కొద్దిరోజులు శ్రీకాకుళం వీరఘట్టంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో డ్రాయింగ్ టీచర్గా పనిచేశారు. గుడివాడకి చెందిన సినిమాటోగ్రాఫర్ వీఎస్ఆర్ స్వామి ప్రోత్సాహంతో సినిమాల్లో ప్రవేశించారు. దాదాపు 270 సినిమాలకు పాటలను రాశారు. 1500లకు పైగా గీత రచనలు చేశారు. సమాజాన్ని ఉత్తేజితం చేసే నాటకాలను రచించారు. అనేక కవితలు రాశారు.
శ్రీకాకుళం జిల్లాలో పని చేస్తోన్నప్పుడే ఆంధ్రా అభ్యుదయ నాట్యమండలిలో సభ్యుడిగా చేరారు. ఈ నాట్య మండలి కోసం పలు నాటకాలను రచించారు. తాన స్వయంగా అందులో నటించారు కూడా. ప్రత్యేకించి మాయల మరాఠీ నాటకంలో మాయల ఫకీర్ పాత్రను పోషించారు. ఈ పాత్ర ఆయనకు పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది. మాయల ఫకీర్ పాత్రలో రక్తి కట్టించేవారు. తన చుట్టూ ఉన్న పరిసరాలను ఆధారంగా చేసుకుని అప్పటికప్పుడు పాటలను రాయడం జాలాది ప్రత్యేకత.
గ్రామీణ వాతావరణం, వ్యవసాయం, పంటపొలాలు, రైతాంగం అనేవి జాలాది అత్యంత ఇష్టమైనవి. అందుకే వాటిని ఆధారంగా చేసుకుని జాలాది అనేక పాటలను రాశారు. సొంతంగా సంగీతాన్ని సమకూర్చారు. 1976లో ఆయన సినిమా రంగంలోకి అడుగుపెట్టి పల్లెసీమ సినిమాకి పాటలు రాశారు. మరో రచయిత మోదుకూరి జాన్సన్ సహకారంతో పల్లెసీమ సినిమాకు పాట రాసే అవకాశం సంపాదించారు జాలాది. దర్శకుడు పీ చంద్రశేఖర్ రెడ్డి, నిర్మాతలు బలరామరెడ్డి, పరంధామ రెడ్డి ఆయనను ప్రోత్సహించారు.
ప్రాణం ఖరీదు సినిమాలోని పాటలు జాలాదికి మంచి గుర్తింపును ఇచ్చాయి. గ్రామీణ ప్రజలు మాట్లాడుకునే వాడుక భాషలో పాటలు, కవితలు, రచనలు రాసేవారు. దీనితో అవి బాగా ప్రాచుర్యం పొందాయి. అలాగే ఉత్తరాంధ్ర ప్రజల యాసను సైతం తన పాటల్లో పొందుపరిచేవారు. 1993లో మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నాదేశం నమో నమామి పాటకు అవార్డులు దక్కాయి. ఎర్రమందారం సినిమాకు నంది అవార్డును అందుకున్నారు.
కళా సాగర్, కళా ప్రపూర్ణ వంటి పురస్కారాలు లభించాయి. జాలాది 79 ఏళ్ల వయసులో 2011 ఆగస్ట్ 14న విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. తూర్పు వెళ్ళే రైలు, ప్రాణం ఖరీదు, కోతలరాయుడు, మేజర్ చంద్రకాంత్ వంటి చిత్రాలకు ఆయన పాటలను రాశారు. గ్రామ మూలాల్లో మరుగనపడిన జానపదులను వెలికి తెచ్చిన ఘనుడు జాలాది. అందుకే ఆయనను జానపద జాబిలిగా పిలుస్తుంటారు అభిమానులు.