Uyyalawada Narasimha Reddy: సైరా.. సైసైరా
అమరావతి: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలను నిర్వహిస్తోంది. దేశ పౌరులందరూ ఏదో ఒక సందర్భంలో ఈ అమృత మహోత్సవంలో భాగస్వామ్యులవుతోన్నారు. పంద్రాగస్టు సమీపిస్తోన్న కొద్దీ స్వాతంత్ర్య దినోత్సవాల సౌరభాలు గుభాళిస్తోన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి మేరకు కోట్లాదిమంది నెటిజన్లు తమ ప్రొఫైల్ పిక్ను జాతీయ జెండా మార్చుకుంటోన్నారు.
త్యాగధనుల చరిత్ర మరొక్కసారి..
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని తెరపైకి రాని కొందరు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను పరిచయం చేస్తోంది. స్వాతంత్య్ర పోరాట సమరయోధులు, త్యాగధనులు కనుమరుగైపోయిన వారి కథనాలను వెలికి తీసే ప్రయత్నానికి పూనుకొంది. ఈ క్రమంలో దేశం విస్మరించిన దేశభక్తుల పేర్లను కొంతవరకైనా పాఠకులకు తెలియజేయాలని సంకల్పించింది. అలాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకరు.
తొలి స్వతంత్ర పోరాట యోధుడిగా..
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. పేరు వినగానే రోమాలు నిక్కబొడుచుకునే చరిత్ర ఆయన సొంతం. స్వాతంత్ర్య పోరాటాన్ని ఆరంభించిన తొలి పోరాట యోధుడు. సిపాయి తిరుగుబాటు కంటే ముందే రాయలసీమలో తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాటం సాగించినట్లు చరిత్ర చెబుతోంది. 1800 నాటికి రాయలసీమలో ఉన్న 80 మంది పాలెగాళ్లల్లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఒకరు. బ్రిటీషర్ల దోపిడీని 5,000 మంది సాయుధులు, తోటి పాలెగాళ్ల సహకారంతో తిరుగుబాటు చేసిన మొనగాడు.
రేనాటి ప్రాంత రారాజుగా..
1846లో బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు ప్రారంభించారు. 1857 పిపాయిల తిరుగుబాటు కంటే ముందే ఇది ఆరంభమైంది. సుమారు ఏడాది కాలం పాటు పోరాడారు. ఆయన పోరాటం మొత్తం గెరిల్లా పద్ధతుల్లో సాగిందని చరిత్రకారులు చెబుతున్నారు. బ్రిటీషర్లకే పరిమితమైందనుకున్న ఫిరంగులను సైతం ఆయన తన పోరాటంలో వినియోగించారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని కేంద్రబిందువుగా చేసుకుని బ్రిటీషర్లను గెరిల్లా యుద్ధ పద్ధతులతో ముప్పతిప్పలు పెట్టారు. సైరా అంటే.. సైసైరా అనే సైన్యాన్ని ఆయన తయారు చేసుకున్నారు.
తిరుగుబాటు ఎందుకు?
బ్రిటీష్ పాలనా విధానంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రైతుల నుంచి కొత్త పన్నుల వసూలు విధానం అమలులోకి వచ్చింది. అప్పటివరకూ రైతుల నుంచి పన్నులు వసూలు చేయడానికి విజయనగర సామ్రాజ్యం నుంచి ఆనవాయితీగా వస్తోన్న పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేయడంతో తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. పన్నులను నేరుగా ఈస్టిండియా కంపెనీ వసూలు చేయడంతో తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల నిర్వహణ కష్టతరమైంది. దీనికి వ్యతిరేకంగా పాలెగాళ్లు తిరుగుబాటు చేశారు. దీనికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి నాయకత్వం వహించారు.
ఉరితీత..
1847 ఫిబ్రవరి 22వ తేదీన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిని కుందూ నది తీరంలో పేరుసోమల వద్ద బ్రిటీష్ సైనికులు బంధించారు. బహిరంగంగా ఉరి తీశారు. తిరుగుబాటుదారుల్లో భయం కల్పించడానికి కొన్ని సంవత్సరాల పాటు పార్థివ దేహాన్ని కోటగుమ్మానికి వేలాడదీశారు. వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తొలి స్వాతంత్ర్య సంగ్రామ యోధుడిగా కేంద్రం గుర్తించింది. 2017లో పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది.