కార్తీకమాసంలోనే వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా?: ఆ ఈవెంట్తో ఎన్నో ప్రయోజనాలు..!
కార్తీకమాసం అంటే వనభోజనాలకు కేరాఫ్. ఏడాదిలో ఒక్కసారయినా తమ కుటుంబం, బంధుమిత్రులతో కలిసి వనభోజనాలను వెళ్తుంటారు చాలామంది. కార్తీకమాసంలో సోమవారం నాడు ఉపవాసం ఉండటానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో.. అంతే ప్రాధాన్యత ఈ వనభోజనాలకు కూడా ఉంటుంది. ఓ ఈవెంట్గా దీన్ని నిర్వహిస్తుంటారు చాలా చోట్ల. ఈ నెలలో ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలతో పండగ వాతావరణం, కోలాహలం నెలకొంటుంది.
శ్రావణం, వైశాఖం వంటి మాసాలు ఉన్నప్పటికీ.. కార్తీక మాసంలోనే వనభోజనాలను నిర్వహించడానికి కారణాలు లేకపోలేదు. పైగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఉసిరి కాయను తినడం, ఆ చెట్టును పూజించడం, దాని కింద కూర్చుని భోజనం చేయడం ఇవన్నీ ఒక పవిత్ర కార్యంగా భావిస్తుంటారు. ఉసిరి చెట్టుకు ఉన్న మరో పేరు ధాత్రి. లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందుకే శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన కార్తీకమాసంలో ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయాలని పెద్దలు చెబుతుంటారు.
ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది సరిగ్గా భోజనం చేయరు. పని ఒత్తిళ్ల మధ్యే భోజనాన్ని ముగిస్తుంటారు. అదే ఒత్తిడితో రాత్రివేళ కూడా సంతుష్టకరమైన ఆహారాన్ని తీసుకోరు. మనం ఏం తింటున్నామో కూడా తెలియని విధంగా మారింది చాలామంది దినచర్య. దీన్ని అధిగమించడానికి వనభోజనాల పేరుతో ఒక్కసారయినా ప్రశాంతంగా, మనస్ఫూర్తిగా పిండి వంటలను భుజించడం, ఉసిరి చెట్టు కింద కూర్చుని తినడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఈ నియమాన్ని పెట్టారు.
కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహా విష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. వనభోజనాలను మరింత విస్తరించే సంస్కృతి నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం వద్ద దూరపు బంధువులను కలుసుకుంటారు. బంధుమిత్రులతో సరదాగా గడపడానికీ ఆవి ఉపకరిస్తాయి. తోటి మనుషులతో నెలకొన్న మనస్పర్థలు కూడా తొలగిపోవడానికి ఈ వనభోజనాలు ప్రధాన కేంద్రంగా మారుతుంటాయి.
Recommended Video
వన భోజనం అంటే.. చెట్ల మధ్య కూర్చుని ఆహారాన్ని స్వీకరించడం. అందులోనూ ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల ఆయా చెట్ల మీదుగా వీచే గాలి.. మనస్సుకు ప్రశాంతతను, హాయిని కలిగించడమే కాకుండా.. ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. ప్రత్యేకించి- ఉసిరి చెట్టు నుంచి వచ్చే గాలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతారు.