రామానుజాచార్యులు: సమతామూర్తి ఎలా అయ్యారు?
భగవద్ రామానుజాచార్యులు.. వెయ్యేళ్ల కిందటే సమసమాజం కోసం పాటు పడ్డారు. ఆచార్య వ్యవహారాలు ఒక ఛాందసంగా మరి సామజిక పురోగతికి అడ్డురాక ముందే సమాజ శ్రేయస్సు కోసం కృషి చేశారు. పరమాత్ముడి దృష్టిలో అందరూ సమానులే. మోక్షానికి అందరూ అర్హులే అంటూ సర్వ మానవ సమానత్వ భావాన్ని బోధించారు రామానుజులు. అందుకే సమతామూర్తి అయ్యారు. సకల మానవళి మేలు కోసం విశిష్టాద్వైతాన్ని బలంగా ప్రచారం చేశారు.

120 సంవత్సరాల పాటు
తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 1,017వ సంవత్సరంలో జన్మించారు. 120 సంవత్సరాల పాటు జీవించారు. 1,137 వ సంవత్సరం మాఘ శుద్ధ దశమి నాడు పరమపదించారు. దేశం మొత్తం పర్యటించారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం వెయ్యేళ్ల కిందటే బోధనలు చేశారు. తమిళనాడులోని కాంచీపురం, శ్రీరంగంలో ఎక్కువ భాగం గడిపారు. అన్నమాచార్యులు, భక్త రామదాసు, త్యాగరాజస్వామి, భక్త కబీర్, మీరాబాయి వంటి తాత్వికులకు ఆదర్శప్రాయంగా నిలిచారు.

పూజా విధానాలను ఆద్యుడు..
ఓం నమో నారాయణాయ అనే మంత్ర బీజాక్షరానికి ఆద్యుడు రామానుజులే. పంచభూతాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వెయ్యేళ్ల కిందటే చాటి చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల శ్రీవారి ఆలయం, శ్రీరంగంలోని రంగనాథస్వామి వారి పుణ్యక్షేత్రం సహా- దేశంలోనే అనేక ఆలయాల్లో పూజా విధానాలకు రూపకర్తగా నిలిచారు. పూజా విధానాలను చాటి చెప్పారు. వైష్ణవ సంప్రదాయానికి రామానుజాచార్యులు ఆద్యులు. తన జీవితకాలంలో పలుమార్లు ఆయన తిరుమలను సందర్శించినట్లు చరిత్ర చెబుతోంది.

వివక్షతను రూపుమాపేలా..
భూమి మీద జీవించే ప్రతి ఒక్కరూ సమానమేనని చాటి చెప్పారు. నరనరాల్లో జీర్ణించుకుపోయి వర్ణ వివక్షతను రూపుమాపే దిశగా సమాజాన్ని చైతన్య పరిచారు. మనుషుల మధ్య అధికులం, అధమత్వం అనే తేడాలను నిర్మూలించేలా బోధనలు చేశారు. కులాధిపత్య భావజాలం, జాఢ్యాన్ని తుడిచి పెట్టారు. మనుషుల మధ్య అంతరం, వివక్షలను తొలగించడానికి కంకణ బద్దుడయ్యారు. మనుషులంతా
సమానులే అని చాటి చెప్పారు. దేశం అంతా విస్తృత ప్రచారం చేసారు.

మోక్ష మంత్రాన్ని అందరికీ బోధించిన మహనీయుడు..
తనకు మాత్రమే బోధించిన మోక్ష మంత్రాన్ని గుడి గోపురం ఎక్కి అందరికీ వినిపించేలా నినదించిన మహనీయుడాయన. తాను నమ్మిన సమతా సిద్ధాంతాన్ని తనకే పరిమితం చేసుకోలేదు. ప్రతి ఒక్కరూ అనుసరించేలా చేశారు. వెయ్యేళ్ల కిందటే దేవాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించారు. నిమ్న వర్గాలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అందుకే ఆయన సమతామూర్తి అయ్యారు. ఆ పేరు మీదే 216 అడుగుల ఎత్తయిన విగ్రహం రూపుదాల్చింది.

చినజీయర్ స్వామి పర్యవేక్షణలో..
శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారు ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్లో గల చినజీయర్ స్వామివారి ఆశ్రమంలో ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం శనివారం జరుగనుంది. వెయ్యేళ్ల కిందటే రామానుజులు ప్రచారం చేసి, ఆచరించి చూపిన సమతా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అవసరం ఉందనే ఆదేశించేలా- ఈ విగ్రహానికి రూపకల్పన చేశారు. సమతామూర్తి అనే పేరు పెట్టారు.












Click it and Unblock the Notifications