పంట రుణ లక్ష్యాలే ‘ఘనం’ కానీ సేద్యానికి ఓ ఉద్దీపన కావాలి
న్యూఢిల్లీ/ ముంబై : వచ్చే ఆర్థిక సంవత్సరం (2018 - 19) బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యవసాయ రుణ లక్ష్యాలు పెంచుతారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అధికార బీజేపీ గణనీయంగా దెబ్బ తిన్నది మరి. రెండు రోజుల క్రితం 'టైమ్స్ నౌ' అనే ఆంగ్ల టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ప్రధాని నరేంద్రమోదీ.. తమ ప్రభుత్వ పనితీరు పట్ల రైతుల్లో అసంత్రుప్తి ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. అయితే రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రతిపాదించారు.
ఆ సంగతలా ఉంచితే ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) బడ్జెట్ వ్యవసాయ రుణ లక్ష్యం రూ.10 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయించిన రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణ లక్ష్యంలో సెప్టెంబర్ 2017 నాటికి రూ.6.25 లక్షల కోట్ల రుణాలే మంజూరయ్యాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018 - 19లో ఈ రుణ లక్ష్యాన్ని మరో లక్ష కోట్ల రూపాయలు పెంచవచ్చన్నది అంచనా. ఇదే జరిగితే రాబోయే బడ్జెట్లో రుణ లక్ష్యం రూ.11 లక్షల కోట్లకు పెరిగే అవకాశముంది.

వ్యవసాయానికి ఉద్దీపన అమలు ఆవశ్యకత ఇది
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, ఆర్థికశాఖల్లో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అత్యధిక వ్యవసాయ ఉత్పత్తి సాధన విషయంలో ‘రుణ లభ్యత'కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రైవేట్ రుణ దాతల వద్ద రుణాలు రైతులకు ఇబ్బందికరంగా పరిణమిస్తున్న నేపథ్యంలో, తగిన వడ్డీ రేటు ఉన్న వ్యవస్థీకృతమైన పటిష్ట రుణ వ్యవస్థను రైతులకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలా ఉంటే దేశానికి వెన్నెముక వంటి రైతు సాగిస్తున్న పంటల సేద్యానికి ఒక ఉద్దీపన అవసరమన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఇప్పటికే రుణాల ఊబీ, పంట నష్టాలు, గిట్టుబాటు ధర లభించక సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయ శాఖను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉద్దీపన పథకం అమలు చేయడం ద్వారా నష్టాల్లో చిక్కుకున్న రసాయన ఎరువుల సంస్థలను ఆదుకునే వెసులుబాటు ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది.

ఎరువుల తయారీలో సహజ వాయువు ధర మోయలేని భారం
పంటల సాగు విధానానికి ఒక ఉద్దీపన ప్రకటించడంతోపాటు నీటి పారుదల ప్రాజెక్టులు, పంటల బీమా, పంట రుణాలపై ద్రుష్టి సారిస్తే రసాయన ఎరువుల ఉత్పత్తిదారులు, రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏ పంట సాగు చేయాలన్న ‘యూరియా' వాడకం తప్పనిసరి. దీని తయారీ మాత్రం ఎంతో వ్యయంతో కూడుకున్న పని. ఒకవైపు ప్రభుత్వ నియంత్రణ మరోవైపు యూరియా పంపిణీ, దాని ఉత్పత్తికి సహజ వాయువు సరఫరాలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్లస్ కేంద్ర ప్రభుత్వ వైఖరిని బట్టి సహజ వాయువు ధర నిర్ణమవుతుంది. అంటే దాని ధర అత్యధికమే. ఇక యూరియా ఉత్పత్తి చేస్తున్న సంస్థలు డీలర్ల ద్వారా రైతుకు చేర్చాల్సి ఉంటుంది. ఈ దశలో వాస్తవ ధరపై డీలర్కు కమిషన్ చెల్లించాలి. ఈ కమిషన్కు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి సరిపోతుందని యూరియా పరిశ్రమలు చెప్తున్నాయి.

నిర్దేశిత ‘ఏడు రోజుల్లో'నే రైతుల ఖాతాల్లో నగదు సబ్సిడీ
మరోవైపు నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం (ఎన్పీకే) కాంప్లెక్స్ ఎరువులపై సబ్సిడీ ఫిక్స్డ్గా ఉంటుంది. మార్కెట్ ధర మాత్రం అస్థిరంగా ఉంటున్న పరిస్థితుల్లో 65 శాతం ‘ఎన్పీకే' ఎరువుల వాడకంపై వచ్చే సబ్సిడీ 30 శాతం మాత్రమే ఉంటున్నది. ఇటీవలి కాలంలో ఆర్థిక సంవత్సరం తొలి ఏడెనిమిది నెలల్లో మాత్రమే సబ్సిడీ లందుతుంది. దీనివల్ల సదరు రసాయన ఎరువుల సంస్థలు స్వల్పకాలిక రుణాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి తోడు జాతీయ స్థాయిలో నగదు బదిలీ పథకం కింద ఎరువుల సబ్సిడీ విధానం అమలుకు చర్యలు ప్రారంభం అయ్యాయి. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ నిర్దిష్టంగా ఏడు రోజుల గడువులోపు రైతులు కొన్న ఎరువులకే సబ్సిడీ కేటాయిస్తుంది. దీనివల్ల ఇటు రైతులు, అటు వ్యాపారులు, ఎరువుల తయారీదారులకు ఇబ్బందికరంగా మారుతుంది. సబ్సిడీల్లో పాత బకాయిలు ఒకేసారి క్లియర్ చేసి, సరిపడా రెగ్యులర్ సబ్సిడీలకు నిధులు కేటాయించడం కూడా ఎరువుల పారిశ్రామిక రంగం బాగోగులను నిర్దారించనున్నది. మరోవైపు యూరియా ఉత్పత్తిదారులు సైతం సవరించిన ధరలపై సబ్సిడీ చెల్లింపు కోసం ఎదురు చూస్తున్నారు. మూడేళ్ల చెల్లింపులు వారి ఆర్థిక పరిస్థితిని నిర్దేశించనున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుంటే సదరు యూరియా ఉత్పత్తిదారుల ఆదాయం, లాభాలపై గణనీయ స్థాయిలో ప్రభావం, ఒత్తిడి పడుతుందని పలు అధ్యయనాలు చెప్తున్నాయి.

ఎఫ్డీఐ పెంపునకు చర్యలు తీసుకోవాలని ఎఫ్ఎంసీజీ సంస్థల అభ్యర్థన
వినియోగదారుల కొనుగోళ్ల శక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) సంస్థలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణుల ఆదాయాన్ని పెంచాలని, అప్పుడే గ్రామీణ మార్కెట్ బలపడగలదన్న ఎఫ్ఎంసీజీ కంపెనీలు.. మరింతగా ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాలని కోరాయి. పంటల నిల్వల కోసం గోదాముల ఏర్పాటుకు వీలుగా ప్రోత్సాహకాలను ప్రకటించాలని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పెరిగేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశాయి. గ్రామీణుల ఆదాయ వనరులు అంతంతమాత్రంగానే ఉన్నాయని, సరిపడా ఉపాధి అవకాశాలు ఉండటం లేదని గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఎండీ, సీఈవో వివేక్ గంభీర్ అన్నారు. వ్యవసాయోత్పత్తిని మెరుగుపరుచడం, రాయితీలు పక్కదారి పట్టకుండా చూడటం వంటి వాటితో రైతుల చేతుల్లోకి మరింత నగదు రాగలదన్నారు. ఇది వారి కొనుగోళ్ల శక్తిని పెంచగలదని, తద్వారా ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయని, దీంతో పన్నుల రూపేణా ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగమైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల బలోపేతానికీ బడ్జెట్ దోహదపడాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications