ప్రజా మేనిఫెస్టో: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండనున్నాయో తెలుసా..?
లోక్సభ ఎన్నికలకు మూడునెలలు మాత్రమే సమయం ఉండటంతో కాంగ్రెస్ అప్పుడే తన మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడింది. మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందులో భాగంగా రాజ్యసభ ఎంపీ రాజీవ్ గౌడ బెంగళూరులో ప్రజలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కూడా హాజరయ్యారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రజల అభిప్రాయాలు
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు వ్యూహప్రతివ్యూహాలతో ముందుకెళుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందుకేసి అప్పుడే మేనిఫెస్టోను రూపొందించే పనిలో పడింది. ఇందుకోసం ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని భావించింది. ముందుగా బెంగళూరులో ప్రజలతో సమావేశమయ్యారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిదంబరంతో పాటు ఎంపీ రాజీవ్ గౌడ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో వీరు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి మరో నెలలో మేనిఫెస్టో రూపొందిస్తామని రాజీవ్ గౌడ చెప్పారు.
రానున్న ఐదేళ్లలో ఎలాంటి దేశం కావాలని మీరు భావిస్తున్నారు అని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అక్కడికి చేరివచ్చిన ప్రజలను అడిగారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఏదీ సరిగ్గా అమలు కావడం లేదన్న చిదంబరం... ప్రజల గొంతుకే మేనిఫెస్టో రూపంలో వస్తుందని చెప్పారు.
వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత
ఇక ప్రజల నుంచి వారి అభిప్రాయాలను చాలా సేకరించారు. అందులో ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా ఎలా మార్చాలన్న దానిపై చర్చించారు. అనంతరం దేశ ఆర్థిక స్థితిగతులపై చర్చ జరిగింది. రైతులకు ఇచ్చిన రుణమాఫీలు ఏమాత్రం సరిపోవడం లేదని కొంతమంది అభిప్రాయపడ్డారు. సూక్ష్మ, మధ్య చిన్న పరిశ్రమల పరిస్థితి మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఆ తర్వాత నగరాల్లో వనరులను ఏ విధంగా అభివృద్ధి చేయాలనేదానిపై అభిప్రాయాలను సేకరించారు. నగరాలను ద్వితీయ శ్రేణి నగరాల జాబితాలోకి చేర్చాలని ఓ వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఇలా చేయడం వల్ల ప్రథమ శ్రేణి నగరాలపై కొంత భారం తగ్గుతుందని చెప్పుకొచ్చారు.
దేశానికి సవాలుగా మారిన ఉద్యోగ కల్పన
ఉద్యోగాల కల్పన దేశంలో పెద్ద సవాలుగా మారిందని అన్నారు బైకాన్ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా. సూక్ష మధ్య చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించగల సామర్థ్యం ఉందని ఆ దిశగా చొరవ తీసుకుంటే ఉద్యోగాల కల్పన అసాధ్యమేమీ కాదని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాదు సైన్స్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి అధిక మొత్తంలో నిధులు కేటాయించాలని కిరణ్ మజుందార్ షా కోరారు. వైద్యరంగంపై దృష్టి సారించాలని చెప్పిన మజుందార్ షా... ఈ రంగాన్ని విస్మరించడం ద్వారా పెద్ద తప్పిదం చేస్తున్నట్లు చెప్పారు. ఏడాదికి 12వేల మంది స్పెషలిస్టు డాక్టర్లు మాత్రమే వస్తున్నారని ఈ సంఖ్య చాలా తక్కువని ఆమె అభిప్రాయపడ్డారు. ఔషధాలు, హాస్సిటల్స్కు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆమె అన్నారు.
స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలి
ఇక కొత్త ప్రభుత్వం పలు రంగాలపై దృష్టి సారించాలని పలువురు కోరారు. స్కిల్ ఇండియా కార్యక్రమం పెద్దగా ఫలితాలు చూపడం లేదని అభిప్రాయపడ్డ ప్రజలు... స్కిల్ ఇండియా కార్యక్రమం బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇక పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని దానిపై దృష్టి సారించాలని మరికొందరు చెప్పారు. మేనిఫెస్టోలో గ్రామీణ ప్రాంత సమస్యలతో పాటు రైతుల సమస్యలకు కూడా చెక్ పెట్టేలా రూపొందించాలని వెల్లడించారు.
పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లుగా ఉన్నాయి కొన్ని పథకాలు
మేకిన్ ఇండియా పేరు బాగుంది కాని పనితీరు మాత్రం అధ్వాన్నంగా ఉందన్నారు ఆలిండియా మానుఫాక్చరింగ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి రఘునాథ్. ఇలా కొన్ని పేరు వినడానికి బాగున్నాయి కానీ పనితీరు మాత్రం శూన్యం అని అన్నారు. ఇలాంటి పథకాలను సీరియస్గా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు దేశంలో అన్ని ఒక పద్ధతిలోనే జరగాలని ఆకాంక్షించారు రఘునాథ్. ఒకే దేశం ఒకే ధర, ఒకేదేశం ఒకే పన్ను విధానం, ఒకే దేశం ఒకే విద్యుత్ ధరలు, ఒక దేశం ఒక పెట్రోల్ ధరలాంటి వాటిపై దృష్టి సారించాలని రఘునాథ్ కోరారు. మేనిఫెస్టోలు ఎన్నైనా తయారు చేయొచ్చు కానీ అవి అమలు అయితేనే వాటికి విలువ ఉంటుందని రఘునాథ్ అభిప్రాయపడ్డారు.