కరోనా సంక్షోభం : అమెరికాలో వ్యవసాయ రంగం కుదేలు.. ట్రంప్ భారీ రిలీఫ్ ప్యాకేజీ..
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో పరిశ్రమలు,వ్యవసాయ ఉత్పత్తులపై అది తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 19 బిలియన్ డాలర్ల రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించారు. 'కరోనా మహమ్మారిని తట్టుకుని నిలబడిన మన గొప్ప రైతులు,పశువుల పెంపెకందారులకు ఈ ప్యాకేజీని అందించబోతున్నాం' అని తెలిపారు. నష్టాలను చవిచూసిన రైతులు,పశువుల పెంపకందార్లకు.. వారి ఖాతాల్లో రిలీఫ్ డబ్బును జమచేస్తామని చెప్పారు.

ఫుడ్ సప్లై చైన్పై ప్రభావం
ఓవైపు రెస్టారెంట్లు,స్కూళ్లు మూతపడటం, ఎక్కువమంది అమెరికన్లు ఇళ్లకే పరిమితమై తింటుండటంతో ఆహార పదార్థాలకు డిమాండ్ ఏర్పడిందని అగ్రికల్చర్ సెక్రటరీ సోనీ పెర్ద్యూ తెలిపారు. మరోవైపు పండించిన పంటను,డైరీ ఉత్పత్తులను కొనేవాళ్లు లేక రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో డైరీ ఉత్పత్తులను,పంటను రైతులు వదిలేసుకోవాల్సి వస్తుందన్నారు. ఈ పరిస్థితులన్నీ ఫుడ్ సప్లై చైన్పై ప్రభావం చూపించినట్టు తెలిపారు.

తీవ్రంగా ప్రభావితమైన వ్యవసాయ రంగం
మార్కెట్కు తరలించేందుకు సిద్దంగా ఉన్న కూరగాయాలను పారవేయడం,పాడి ఉత్పత్తులైన పాలను నేలపాలు చేసుకోవాల్సి రావడం ఆర్థిక నష్టమే కాదు.. వాటి ఉత్పత్తిదారులకు హృదయవిదారకమని పెర్ద్యూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతుల పాల ఉత్పత్తికి,కొనుగోలుకు 3బిలియన్ డాలర్లను కేటాయిస్తున్నామని తెలిపారు. ఆ ఉత్పత్తులు తిరిగి కమ్యూనిటీ ఫుడ్ బ్యాంకులకు చేరుతాయని చెప్పారు. కరోనా మహమ్మారి దెబ్బకు అమెరికా వ్యవసాయ,ఆహార ఉత్పత్తులు దారుణంగా ప్రభావితమయ్యాయి. పంట కోతలకు కూలీలు దొరక్క,కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నారు. రెస్టారెంట్లు,స్కూళ్లు,బార్లు,కూరగాయల దుకాణాలు ఇతరత్రా షాపులు మూతపడటంతో కమర్షియల్ డిమాండ్ పడిపోయింది. చాలావరకు మాంసం ప్యాకింగ్ యూనిట్లు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

ఇప్పటికే 2 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ
కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అమెరికన్ ప్రభుత్వం ఇప్పటికే 2 ట్రిలియన్ డాలర్ల రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. వ్యాపారవేత్తలు, కార్మికులు, వైద్య సిబ్బంది ఈ ప్యాకేజీ కింద భారీ మొత్తంలో డబ్బు అందుకోనున్నారు. అలాగే సాధారణ పౌరుల ఖాతాల్లోనూ డబ్బులు జమకానున్నాయి. అమెరికా చరిత్రలో ఇదే అతిపెద్ద ఉద్దీపన ప్యాకేజీ అని నిపుణులు చెబుతున్నారు. ఓవైపు ఆర్థిక సంక్షోభం.. మరోవైపు పెరుగుతున్న కేసులు అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆర్థికపరంగా రిలీఫ్ ప్యాకేజీలు ప్రకటిస్తున్నప్పటికీ.. కరోనా కేసులు తగ్గకపోవడం,మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు అమెరికాలో 7,10,272 పాజిటివ్ కేసులు నమోదవగా 37,175 మంది మృత్యువాతపడ్డారు. అత్యధికంగా న్యూయార్క్,న్యూజెర్సీలో 2,33,951 కేసులు,78,467 కేసులు నమోదయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 20971 మంది మృత్యువాతపడ్డారు.












Click it and Unblock the Notifications