పెట్రోల్ బంకులు బంద్, రంగంలోకి సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం ఒక్క సారి సంభవించిన పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇంధన సరఫరాలో అంతరాయం, పెట్రోల్ బంకుల మూసివేతపై అధికారులతో ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు. ప్రజలకు, ముఖ్యంగా రైతన్నలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (CS) సాయిప్రసాద్, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం, జిల్లా కలెక్టర్లతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, బంకుల యజమానులతో చర్చించి సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించినా లేదా బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కొరతకు కారణాలేంటి? ఇంధన సంస్థల వివరణ
రాష్ట్రంలో పెట్రోల్ 15 శాతం, డీజిల్ 25 శాతం వినియోగం పెరిగిందని ఇంధన సంస్థల రాష్ట్ర సమన్వయకర్త భాస్కర్రెడ్డి వెల్లడించారు. ప్రైవేటు బంకుల్లో విక్రయాలు నిలిచిపోవడంతో, ఆ భారం ప్రభుత్వ రంగ బంకులపై పడింది. పరిశ్రమలకు సరఫరా చేసే డీజిల్ ధర లీటరుకు రూ.152 ఉండటంతో, వారు కూడా సామాన్యులు వాడే బంకుల నుంచే కొనుగోలు చేస్తున్నారు. స్టాక్ అయిపోతుందన్న ప్రచారంతో వాహనదారులు ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం వల్ల, మూడు రోజులు రావాల్సిన నిల్వలు ఒక్క పూటలోనే ఖాళీ అవుతున్నాయి.
అల్లాడుతున్న రైతన్నలు
గోదావరి జిల్లాల్లో రబీ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. డీజిల్ దొరకకపోవడంతో కోత యంత్రాలు నిలిచిపోయాయి. ఇదే అదునుగా యంత్రాల యజమానులు గంటకు రూ.400 అదనంగా వసూలు చేస్తున్నారని కౌలు రైతులు వాపోతున్నారు. అటు ఆక్వా సాగులో ఎయిరేటర్లు నడపడానికి డీజిల్ లేక రొయ్యల రైతులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితి
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంది.
- పశ్చిమ గోదావరి: వేండ్ర, భీమవరం పరిసరాల్లో ఐదు రోజులుగా డీజిల్ నిల్వలు లేవు. ఆటోలకు కేవలం రూ.100కు మాత్రమే ఇంధనం పోస్తున్నారు.
- కాకినాడ: కాకినాడ నుంచి అన్నవరం వరకు ప్రధాన రహదారిపై ఉన్న అనేక బంకులు నిల్వలు లేక బోర్డులు పెట్టేశాయి.
- కర్నూలు: ఎమ్మిగనూరు, గోనెగండ్ల ప్రాంతాల్లో వాహనదారులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది.
పరిష్కారం దిశగా అడుగులు
రాష్ట్ర పెట్రోల్ బంకుల డీలర్ల సమాఖ్య ప్రతినిధులు పౌరసరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. గతేడాది విక్రయాల కంటే అదనంగా 10 శాతం సరఫరాను పెంచాలని కోరారు. దీనికి ఇంధన సంస్థలు సానుకూలంగా స్పందించాయి. ట్యాంకర్ల రవాణా సమయాన్ని తగ్గించి, సత్వరమే నిల్వలను బంకులకు చేర్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications