పవన్ అనూహ్య నిర్ణయాలు, ఆ నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లు..!?
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానుండటంతో అవసరమైన నిర్ణయాలకు సిద్దమయ్యారు. ఇప్పటికే సభ్యత్వ నమోదు పైన దిశా నిర్దేశం చేసారు. పార్టీకి బలమైన కోటలుగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయి పరిస్థితుల పైన పవన్ రిపోర్ట్స్ సేకరించారు. నివేదికల ఆధారంగా కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు.
గోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ ఇంచార్జ్ల మార్పులు, చేర్పులపై పవన్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నియోజకవర్గ ఇంచార్జ్ మార్పుపై పవన్ ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లను నియమించనున్నారు. గోపాలపురం, చింతలపూడి నియోజకవర్గాల్లో పాత ఇంచార్జ్లను మార్చి కొత్త వారికి బాధ్యతలు ఇస్తారని ప్రచారం సాగుతోంది. గోపాలపురం నియోజకవర్గం ఇంచార్జ్గా ఉన్న సువర్ణరాజును తొలగించి మహిళా నేత ఫాతిమారాణికి అవకాశం ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే చింతలపూడి నియోజకవర్గంలో మేక ఈశ్వరయ్యను తప్పించి ఓ ఎన్నారైకి ఇంచార్జ్ పోస్ట్ ఇస్తారని చెబుతున్నారు.

గోదావరి జిల్లాల పై స్పెషల్ ఫోకస్
ఈ నియామకాల్లో సామాజిక సమీకరణాలతో పాటు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని పవన్ ఆలోచనగా తెలుస్తోంది. అదే విధంగా ఆచంట, తణుకు నియోజకవర్గాల్లోనూ కొత్త ఇంచార్జ్ల నియామకంపైనా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇంచార్జ్ల మార్పునకు ప్రధానంగా రెండు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారని సమాచారం. నియోజకవర్గంలో వారి పనితీరు, రెండోది సభ్యత్వ నమోదులో చూపిన చొరవ పైన పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఎవరు పార్టీ కోసం కష్టపడి జనాల్లోకి వెళ్తున్నారో వారికే బాధ్యతలు దక్కనున్నాయనే ప్రచారం జరుగుతుంది. అదే విధంగా పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఉన్న పరిస్థితులను, ఇంచార్జ్ల మార్పు అవసరాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే ఈ కొత్త ఇంచార్జ్ల జాబితాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.













Click it and Unblock the Notifications