చల్లటి కబురు: మరో 5 రోజుల పాటు వర్షాలు
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలు, విపరీతమైన ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణం చల్లని కబురు చెప్పింది. శుక్రవారం ఉత్తరాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల వడగళ్ల వాన పడటంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. అయితే, ఒక్కసారిగా కురిసిన ఈ వర్షం కారణంగా విజయనగరంలో వాహనదారులు ప్రయాణాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాష్ట్రంలో రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర, దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఉత్తర కోస్తాతో పాటు దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఈ వర్షాలు ప్రజలకు కొంత ఉపశమనాన్ని ఇస్తున్నప్పటికీ.. ఈదురుగాలులు, ఉరుముల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలు
ఒకవైపు వర్షాలు కురుస్తున్నా, మరోవైపు ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. వాతావరణ కేంద్రం గణాంకాల ప్రకారం, మే 1న (శుక్రవారం) రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జంగమహేశ్వరపురం: రాష్ట్రంలోనే అత్యధికంగా 44.5°C ఉష్ణోగ్రత నమోదైంది. గన్నవరంలో 42.9°C, అమరావతిలో 42.8°C ఉష్ణోగ్రత నమోదైంది. నందిగామ, నెల్లూరులో 42.6°C గా రికార్డవ్వగా.. కర్నూలులో 41.4°C ఉష్ణోగ్రత నమోదైంది.












Click it and Unblock the Notifications