మంత్రులు, అధికారులకు చంద్రబాబు విందు - టార్గెట్ ఫిక్స్, బిగ్ టాస్క్..!!
అమరావతి కేంద్రంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అమరావతి క్వాంటం వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి రూ. 1208.41 కోట్లకి.. అలాగే అమరావతి సచివాలయం, జీఏడీ, హెచ్ఓడీ టవర్ల నిర్మాణంలో ఫసాడ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులకు రూ. 2540 కోట్లు వ్యయం చేయడానికి కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. ఏపీ శాసనసభ భవనంలో వివిధ సివిల్ స్ట్రక్చర్ పనులకు రూ. 798 కోట్లు ఖర్చు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ ప్రతిపాదనలకు కూడా మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ రోజు జరగనుంది. ఇందులో పలు కీలక ప్రతిపాదనలను చర్చించి ఆమోదం తెలపనున్నారు. కాగా, కేబినెట్ మంత్రులు, ప్రభుత్వంలోని పలు శాఖల కార్యదర్శలు, వివిధ విభాగాల అధిపతుల(హెచ్ఓడీ)కు సీఎం చంద్రబాబు విందు ఇవ్వనున్నారు. ఈ రోజు (గురువారం) రాత్రి సీఆర్డీఏ కార్యాలయంలో వీరందరికి సీఎం చంద్రబాబు విందు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఈ సమావేశంలో అధికారం చేపట్టిన ఈ 22 నెలల్లో సాధించిన విజయాలు.. రానున్న 38 నెలల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలపై అధికారులతో చర్చించి ఉత్సాహపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. కాగా.. రాజధానిలో 220 కేవీ లైన్ల రీరూటింగ్కు కూడా మంత్రివర్గం అనుమతి ఇవ్వనుంది. రెండో దశ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరుకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.

మంత్రులకు సీఎం దిశా నిర్దేశం
ఇక.. అమరావతిలో ఎల్పీఎస్ జోన్-11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి మౌలిక వసతుల అభివృద్ధికి.. మెట్ట భూములకు ఎకరాకు రూ. 40 వేలు, జరీబు భూములకు రూ. 60 వేల చొప్పున కౌలు పెంపుకు అనుమతి ఇవ్వనుంది. అలాగే ప్రతి ఏడాది మెట్ట భూములకు రూ. 3 వేలు, జరీబు భూములకు రూ. 5 వేల చొప్పున పదేళ్ల పాటు పెంచేందుకు కూడా ఆమోదం తెలపనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెబీకి అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో 1.78 ఎకరాల భూమి కేటాయింపుకు ఆమోదం తెలపనుంది. స్వామి నారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కోసం వేర్వేరు ప్రాంతాల్లో 4.23 ఎకరాల భూమిని కేటాయించనుంది. అగ్నిమాపక శాఖకు రాజధానిలో రాయపూడి వద్ద 2 ఎకరాల స్థలం కేటాయింపుకు అనుమతి ఇవ్వనుంది. రాజధానిలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులకు సీఆర్డీఏ అథారిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. వాటిని కేబినెట్లో ఖరారు చేయనున్నారు. తాజాగా పెట్రోల్ కొరత.. రాజకీయ పరిణామాల పైన మంత్రివర్గం అధికారిక అజెండా పూర్తయిన తరువాత చర్చించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications