చిత్తూరులో దారుణం.. పట్టపగలే జర్నలిస్ట్ దారుణ హత్య
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా వి.కోటలో జర్నలిస్ట్పై జరిగిన దారుణ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రముఖ ఛానల్ ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి ఉదయం వాకింగ్కు వెళ్లిన సమయంలో దుండగుల దాడికి గురై మృతి చెందడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జర్నలిస్టుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తేలా ఈ ఘటన మారింది. దీంతో ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ఉదయం వాకింగ్లోనే దాడి..
పోలీసుల సమాచారం ప్రకారం.. జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజులాగే ఉదయం వాకింగ్కు వెళ్లారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను లక్ష్యంగా చేసుకుని కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు. దాడి అనంతరం నిందితులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన యాదృచ్ఛికంగా కాకుండా ముందుగానే ప్రణాళికతో జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా దుండగులు నేరుగా లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం, తక్షణమే పరారవడం చూస్తే ఇది పూర్వ విరోధాల ఫలితమై ఉండొచ్చని భావిస్తున్నారు. స్థానికంగా జర్నలిస్టుగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి కొన్ని సున్నితమైన అంశాలపై రిపోర్టింగ్ చేశారన్న కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో వి. కోటకు చెందిన రౌడీ షీటర్ తమీమ్ను ప్రధాన అనుమానితుడిగా పోలీసులు గుర్తించారు. అతడు ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నట్లు సమాచారం. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులతో పాటు ఈ ఘటనకు సంబంధం ఉన్న ఇతరులను కూడా గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
సంఘటనా స్థలంలో ఉద్రిక్తత
హత్య వార్త తెలిసిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారు. హత్యకు గల అసలు కారణాలను త్వరలోనే వెలికితీస్తామని అధికారులు తెలిపారు.
జర్నలిస్టు సంఘాల ఆందోళన
జగన్మోహన్ రెడ్డి హత్యను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం, వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండించాయి. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. జర్నలిస్టుల భద్రత కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా కోరాయి. ఈ ఘటనతో జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, సహచరులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆయన మృతి మీడియా రంగానికి తీరని లోటుగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications