ఏపీ హైకోర్టు తొలి మహిళా చీఫ్ జస్టిస్ గా లీసా గిల్.. చంద్రబాబు, జగన్ అభినందనలు..
పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ బుధవారం నోటిఫై చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గిల్ నిలిచారు. ఆమె ఏప్రిల్ 25 నుండి బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేస్తారు. సుప్రీంకోర్టు కొలీజియం ఫిబ్రవరి 26న జస్టిస్ గిల్ను ఈ పదవికి సిఫార్సు చేసింది.
ఆమెకు న్యాయ రంగంలో 36 ఏళ్ల అనుభవం ఉంది. పంజాబ్, హర్యానా హైకోర్టు బెంచ్లో 11 ఏళ్లకు పైగా న్యాయమూర్తిగా సేవలందించారు. ఈ అనుభవంతోనే ఉన్నత పదవికి ఎంపికయ్యారు. ఇక ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ నియామకం కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ చారిత్రాత్మక ఘట్టం ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. జస్టిస్ లీసా గిల్ చట్టబద్ధమైన పాలనను కాపాడుతూ, విజ్ఞత, చిత్తశుద్ధితో న్యాయం చేస్తూ, విజయవంతమైన, స్ఫూర్తిదాయకమైన పదవీకాలాన్ని కొనసాగించాలని తాను కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు ఈ మేరకు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

మరోవైపు ఏపీ మాజీ సీఎం జగన్ సైతం జస్టిస్ లీసా గిల్ కు అభినందనలు తెలిపారు. ఏపీ న్యాయవ్యవస్థకు ఇది గర్వకారణమైన విషయం అని అన్నారు. ఇక జస్టిస్ గిల్ పంజాబ్ విశ్వవిద్యాలయం న్యాయ విభాగం పూర్వ విద్యార్థిని. బీఏ ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేసి 1990లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ సంబంధిత కేసులను నిర్వహించారు. మాజీ న్యాయమూర్తి హర్ఫూల్ సింగ్ బ్రార్ కుమార్తె అయిన జస్టిస్ గిల్, చండీగఢ్ యూనియన్ టెరిటరీ, పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. మార్చి 2014లో న్యాయమూర్తిగా పదోన్నతి పొంది, గత నెలలో ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయ్యారు.












Click it and Unblock the Notifications