YSR కు ఏమైందో చూశారుగా.. సీఎంలకు కేఏ పాల్ శాపనార్థాలు!
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో అటు విజయ్ విజయాన్ని ఆశీర్వదిస్తూనే, ఇటు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తీవ్రస్థాయిలో కేఏ పాల్ మరోసారి నిప్పులు చెరిగారు. టీవీకే అధినేత విజయ్ సాధించిన విజయం తన ఆశీస్సుల వల్లనే సాధ్యమైందని పేర్కొన్న ఆయన, తనతో పెట్టుకున్న వారు ఎవరూ భూమి మీద మిగలరని, తన ఛారిటీలను, సొసైటీలను అడ్డుకోవాలని చూస్తే సర్వనాశనం తప్పదని హెచ్చరించారు.
తమిళనాడు ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. "విజయ్ కేవలం 10 శాతం ఓట్లు సాధిస్తారని, ఐదారు సీట్లకే పరిమితమవుతారని మేధావులు, ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ఆయన ముఖ్యమంత్రి అవుతారని నేను ముందు నుంచే చెబుతున్నాను. విజయ్ నా ఆశీస్సులతోనే ఈ స్థాయికి చేరారు. మేమిద్దరం త్వరలోనే కలిసి పని చేస్తాం. తమిళనాడుకు వందల కంపెనీలను, లక్షల ఉద్యోగాలను తీసుకువచ్చి ప్రపంచ పటంలో నిలబెడతాం. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా మేము అధికారంలోకి వస్తాం" అని పాల్ ధీమా వ్యక్తం చేశారు.

స్టాలిన్ అందుకే మాజీ అయ్యారు..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్పై కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. "మూడేళ్ల క్రితమే స్టాలిన్ను కలిసి తమిళనాడు అభివృద్ధికి ప్రణాళికలు వివరించాను. కానీ ఫిబ్రవరిలో నిర్వహించిన ప్రపంచ శాంతి సభకు అనుమతులు ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెట్టారు. ఉదయనిధి స్టాలిన్ బంధువుల ఒత్తిడి వల్లే నాకు పర్మిషన్ నిరాకరించారు. ఆ రోజే చెప్పాను.. నా మాట వినకపోతే జయలలిత లాగే స్టాలిన్ కూడా మాజీ ముఖ్యమంత్రి అవుతారని. నా శాపం వల్లే ఈరోజు ఆయన అధికారం కోల్పోయారు" అని వ్యాఖ్యానించారు.
తెలుగు సీఎంలకు ఉగ్రత తప్పదు!
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులను ఉద్దేశించి పాల్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. "గతంలో వైఎస్సార్ నా ఛారిటీలను దోచుకోవాలని చూసినప్పుడు దేవుడు ఆయన్ని భూమి మీద లేకుండా చేశాడు. జగన్ నన్ను కలవనందుకే మాజీ అవుతారని జనవరిలోనే చెప్పాను, జూన్లో అది నిజమైంది. ఇప్పుడున్న ముఖ్యమంత్రులకు ఇదే దేవుడి ఫైనల్ వార్నింగ్. నా ఛారిటీలను వేరే వాళ్లకు ఇవ్వాలని చూస్తే దేవుడి ఉగ్రత మీపై ఉంటుంది. నాతో పెట్టుకున్న వాడు ఎవడూ బాగుపడలేదు. రాజకీయంగా మీ పార్టీలు సర్వనాశనం అవుతాయి, గుండె ఆగి చస్తారు. రాత్రింబవళ్లు కష్టపడుతున్న నాకు భారతరత్న ఇవ్వాలని గతంలో లేఖలు రాసిన మీరు, ఇప్పుడు నాపై కక్ష సాధిస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు" అంటూ పాల్ హెచ్చరించారు.














Click it and Unblock the Notifications