Advertisement

టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ నాయకుడికి అందలం: మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా?


గుంటూరు: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. మొన్న ముగిసిన పంచాయతీ పోల్స్‌కు భిన్నంగా పార్టీపరంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తోన్నందున.. అన్ని పక్షాలు దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదుశం, భారతీయ జనతా పార్టీ-జనసేన ఉమ్మడి అభ్యర్థులు వార్డుల్లో జోరుగా క్యాంపెయిన్ చేస్తోన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కనపర్చిన ఊపును కొనసాగించడానికి వైసీపీ కసరత్తు చేస్తోండగా.. దానికి బ్రేక్ వేయడానికి టీడీపీ సర్వశక్తులను ఒడ్డుతోంది. బీజేపీ-జనసేన కూటమి గట్టి పోటీని ఇస్తోంది. వైసీపీ, టీడీపీ అభ్యర్థులకు ధీటుగా ఈ కూటమి ప్రచారాన్ని కొనసాగిస్తోంది.

తురగా కిషోర్‌కు ఛాన్స్?

ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో అందరి దృష్టీ గుంటూరు జిల్లాలోని మాచర్లపై పడింది. వైసీపీ మాచర్ల మున్సిపల్ అభ్యర్థిగా తురగా కిషోర్‌ను ఎంపిక చేశారంటూ వార్తలు వెలువడటమే దీనికి కారణం. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అత్యంత ఆప్తుడనే పేరుంది ఆయనకు. ఇదివరకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు ప్రయాణించిన కారుపై దాడి చేసిన ఆరోపణలు తురగా కిషోర్‌పై ఉన్నాయి. ఈ దాడి ఘటనలో ఆయన అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత స్టేషన్ బెయిల్‌పై విడుదల అయ్యారు. పిన్నెల్ల రామకృష్ణా రెడ్డికి ఆప్తుడు కావడం వల్ల ఆయన విజ్ఞప్తి మేరకు తురగా కిషోర్‌ను మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పార్టీ అగ్ర నాయకులు ఎంపిక చేశారని సమాచారం.

పిన్నెల్లి కారుపై దాడికి ప్రతీకారంగా..

ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కారుపై అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన దాడికి ప్రతీకారంగా తురగా కిషోర్..టీడీపీ నేతల వాహనంపై దాడి చేశారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. రైతుల దాడి వెనుక విజయవాడకు చెందిన బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వరరావుల ప్రమేయం ఉందనే కారణంతో మాచర్ల వచ్చిన ఆ ఇద్దరిపై తురగా కిషోర్ దాడికి దిగారని ప్రచారనే సాగింది. నాటి దాడిలో టీడీపీ నేతలు ప్రయాణిస్తోన్న కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఆ ఇద్దరికీ స్వల్పంగా గాయలయ్యాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం వారిని పరామర్శించారు.

Advertisement
Advertisement
ఆయన అభ్యర్థిత్వమే ఖరారు?

తాజాగా తురగా కిషోర్ పేరును మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిత్వం కోసం ఎంపిక చేశారనే ప్రచారం గుంటూరు జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. మాచర్లకు కాబోయే మున్సిపల్ ఛైర్మన్ ఆయనేనని అంటోన్నారు. ఇప్పటికే మాచర్లలో వార్డులన్నీ దాదాపు ఏకగ్రీవం అయ్యాయని పార్టీ నేతలు చెబుతోన్నారు. గత ఏడాది నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన టీడీపీ, ఇతర పార్టీల నేతలు పలువురు వైసీపీ తీర్థాన్ని పుచ్చుకున్నారని, ఫలితంగా వారంతా ఎన్నికల బరి నుంచి తప్పుకుంటారని భావిస్తోన్నారు. మాచర్ల మున్సిపాలిటీ ఏకగ్రీవం కావడానికి అవకాశం ఉందనే అభిప్రాయాలు పార్టీ నేతల్లో వ్యక్తమౌతోన్నాయి.

English Summary

YSR Congress Party leader Turaga Kishore reportedly choosen as Municipal Chairman candidate of Macherla by the Party top leaders.
Read more...