మనం ఓడిపోయినట్లు కాదు.. దీదీ సంచలన రియాక్షన్!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి అధికారం దిశగా దూసుకుపోతుండగా, మరోవైపు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలతో రంగంలోకి దిగారు. కౌంటింగ్ ప్రక్రియలో భారీ కుట్ర జరిగిందని ఆమె ఆరోపించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయని ఆమె మండిపడ్డారు. అనేక నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పటికీ, ఆ వివరాలను అధికారికంగా ప్రకటించకుండా తొక్కిపెడుతున్నారని ఆమె ఆరోపించారు. "కళ్యాణి వంటి ప్రాంతాల్లో ఈవీఎంలు సరిపోలడం లేదు, పోలీసులు కూడా కేంద్ర బలగాలతో చేతులు కలిపి మాపై దురాగతాలకు పాల్పడుతున్నారు" అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.

బీజేపీ పన్నాగం.. ఏజెంట్లు కదలొద్దు!
బీజేపీ అభ్యర్థులను కావాలనే ముందంజలో చూపిస్తూ టీఎంసీ శ్రేణుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని మమత ఆరోపించారు. పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు ఎవరూ కేంద్రాలను విడిచి వెళ్లకూడదని ఆమె ఒక వీడియో సందేశం ద్వారా పిలుపునిచ్చారు. "ఎవరూ ధైర్యం కోల్పోవద్దు.. ఇది బీజేపీ పన్నాగం మాత్రమే. సూర్యాస్తమయం తర్వాత అసలైన ఫలితాలు వస్తాయి, అప్పుడు మనమే గెలుస్తాం" అంటూ కార్యకర్తలలో భరోసా నింపే ప్రయత్నం చేశారు.
బీజేపీ జోరు.. 'జై శ్రీరామ్' నినాదాలతో కోల్కతా షేక్:
ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. మొత్తం 294 స్థానాలకు గాను బీజేపీ 187 చోట్ల స్పష్టమైన ఆధిక్యంలో ఉండి, అధికారం ఖాయం చేసుకున్నట్లు కనిపిస్తోంది. టీఎంసీ కేవలం 92 స్థానాలకే పరిమితమైంది. దీంతో బీజేపీ శ్రేణులు కోల్కతాలోని మమతా బెనర్జీ నివాసం వెలుపలే 'జై శ్రీరామ్' నినాదాలతో హోరెత్తిస్తూ సంబరాలు చేసుకోవడం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. 2021లో 213 సీట్లతో క్లీన్ స్వీప్ చేసిన మమతకు, ఈసారి నాలుగోసారి సీఎం కావాలన్న ఆశలకు గండి పడేలా ట్రెండ్స్ సాగుతున్నాయి.
రికార్డు పోలింగ్.. మారిన సమీకరణాలు:
స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే బెంగాల్లో ఈసారి రికార్డు స్థాయిలో 92.47 శాతం పోలింగ్ నమోదైంది. ఈ భారీ పోలింగ్ అధికార మార్పిడి కోసమే జరిగిందని బీజేపీ వాదిస్తుంటే, ఇది కుట్ర అని టీఎంసీ ఆరోపిస్తోంది. ఐప్యాక్ (I-PAC) వ్యూహాలు ఈసారి బెంగాల్ మట్టిలో పని చేయలేదని ప్రాథమిక ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మరి 'దీదీ' ఆశించినట్లు సూర్యాస్తమయం తర్వాత ఏవైనా అద్భుతాలు జరుగుతాయా లేదా బెంగాల్ పీఠంపై కమలం విరుస్తుందా అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది.














Click it and Unblock the Notifications