కాంగ్రెస్ 'ఆపరేషన్ సౌత్' షురూ - రాహుల్ సన్నిహిత నేతకు బాధ్యతలు..!!
అయిదు రాష్ట్రాల ఫలితాల తరువాత రాజకీయం మారుతోంది. జాతీయ రాజకీయాల్లో ఈ ఫలితాలు కొత్త సమీకరణాలకు కారణం అవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ అండ్ మిత్రపక్షాలు పూర్తి ఆధిపత్యం సాధించే ప్రయత్నం చేస్తున్నాయి. తమిళనాడులో విజయ్ కు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్.. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దం అవుతోంది. కర్ణాటక- తెలంగాణలో అధికారంలో ఉండటంతో.. ఇక ఆపరేషన్ సౌత్ పేరుతో 2029 లక్ష్యంగా కీలక అడుగులు వేస్తోంది. కాగా.. కేరళ సీఎం ఖరారు విషయంలో రాహుల్ ఇదే లక్ష్యంతో నిర్ణయం తీసుకుంటున్నారు.
కాంగ్రెస్ దక్షిణాది పైన ఫోకస్ చేసింది. కేరళలో అధికారంలోకి వచ్చింది. కర్ణాటక - తెలంగాణలో ఇప్పటికే అధికారంలో ఉంది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వంలో భాగస్వామి అవుతోంది. డీఎంకే అభ్యంతరాలను కాదని.. విజయ్ తో చేతులు కలిపింది. ఇక.. ఇప్పుడు కేరళ సీఎంగా రాహుల్ తన సన్నిహితుడికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీని ద్వారా ఆపరేషన్ సౌత్ -2029 కోసం కాంగ్రెస్ వ్యూహాల అమలు చేస్తోంది. రాహుల్గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, లోక్సభ ఎంపీ కేసీ వేణుగోపాల్ కేరళ సీఎం అవ్వటం లాంఛనంగా కనిపిస్తోంది. సీఎం రేసులో ముందంజలో ఉన్నారు. ఏఐసీసీ పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ ఆధ్వర్యంలో గురువారం తిరువనంతపురంలో జరిగిన సీఎల్పీ సమావేశంలో.. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు వేణుగోపాల్కే ఓటేసినట్లు తెలిసింది. పరిశీలకులు శుక్రవారం ఢిల్లీలో ఖర్గేకు తమ నివేదిక సమర్పించారు. 11న(సోమవారం) వేణుగోపాల్ సీఎంగా పదవీప్రమాణం చేస్తారని విశ్వసనీయ సమాచారం.

దక్షిణాది పై కాంగ్రెస్ కొత్త వ్యూహాలు
ఈ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. గత ఐదేళ్లు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన వీడీ సతీశన్.. అంతకుముందు ఐదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న రమేశ్ చెన్నితల సీఎం కుర్చీ ఆశిస్తున్నారు. ఇటీవలి ఎన్నికల్లో 140 స్థానాల అసెంబ్లీలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 102 స్థానాలు గెలుచుకుంది. ఇందులో కాంగ్రెస్ వాటా 63. ఐయూఎంఎల్(22), కేరళ కాంగ్రెస్(7) సహా మిగతా మిత్రపక్షాలు 39 సీట్లు గెలుచుకున్నాయి. సీఎల్పీ భేటీలో 63 మంది ఎమ్మెల్యేల్లో 43 మంది వేణుగోపాల్ వైపు మొగ్గుచూపినట్లు తెలిసింది. ఈలోపు సతీశన్ వర్గీయులు రోడ్లెక్కారు. అటు వేణుగోపాల్ మద్దతు దారులు పీసీసీ కార్యాలయం ముందు సీఎం వేణుగోపాల్ అంటూ భారీ ఫ్లెక్సీలే పెట్టేశారు. ఇతరుల క్యాబినెట్లో తాను చేరనని.. ముఖ్యమంత్రి పదవి తప్ప మరేదీ తీసుకోనని.. సాధారణ ఎమ్మెల్యేగానే ఉంటానని సతీశన్ అధిష్ఠానానికి తేల్చిచెప్పినట్లు తెలిసింది. మిత్రపక్షాలు సైతం ఆయన్నే సీఎంగా కోరుకుంటున్నాయి. దీంతో.. చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మనహా.. వేణుగోపాల్ సీఎం కావటం ఖాయంగా కనిపిస్తోంది.













Click it and Unblock the Notifications