తమిళనాడు రాజకీయాల్లో భూకంపం..? డీఎంకే- అన్నాడీఎంకే పొత్తు..??
తమిళనాడు రాజకీయాల్లో భూకంపం..? దేశ రాజకీయాల్లోనే ఊహించని పరిణామం తమిళనాట చోటుచేసుకోనుందా..? తమిళనాడులో దాదాపు 40 ఏళ్లకు పైనుంచి నువ్వా నేనా.. అంటూ అధికారం కోసం పోటీ పడిన డీఎంకే- అన్నాడీఎంకే పార్టీలు పొత్తు పెట్టుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో తెరపైకి డీఎంకే, అన్నాడీఎంకే పొత్తులు విషయం రావడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా ముగిసిన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ టీవీకే పార్టీకి 108 స్థానాలు రాగా డీఎంకే పార్టీ 59, అన్నాడీఎంకే పార్టీ 47సీట్లు సాధించాయి. ఈ రెండూ కలిపితే 106 సీట్లు అవుతాయి. ఇక మరో 12 సీట్ల కోసం రెండు పార్టీల మిత్రపక్షాలు మద్దతు ఇస్తాయని సమాచారం అందుతోంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ సపోర్ట్ లేకుండానే ఈ కూటమి అధికారం చేపట్టే అవకాశం ఉన్నట్లు కథనాలు వెల్లడవుతున్నాయి.

ఇప్పటివరకూ తమిళనాడును అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే పార్టీలు శాసిస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్తగా విజయ్ టీవీకే పార్టీ రావడంతో ఈ రెండు ద్రవిడ పార్టీలు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అందుబాటులో ఉండాలని తమ ఎమ్మెల్యేలను డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదే కానీ నిజమైతే తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం అని చెప్పొచ్చు.
What we are hearing is real crazy stuff. Hope it is not true.
— Sumanth Raman (@sumanthraman) May 6, 2026
మరోవైపు తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే పార్టీ అధినేత విజయ్.. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి కోరారు. అయితే విజయ్ సంఖ్యాబలంపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు స్పష్టం అవుతోంది. మ్యాజిక్ ఫిగర్ చూపిస్తేనే అనుమతి ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో రేపు జరగాల్సిన విజయ్ ప్రమాణస్వీకారం రద్దు అయినట్టు సమాచారం. ఇక కాంగ్రెస్ 5 సీట్లతో పాటు విజయ్ గెలిచిన రెండు సీట్లలో ఒకదాన్ని మినహాయిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 112 కు చేరింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకు మరో ఆరుగురి మద్దతు కావాల్సి ఉంది. విజయ్ బృందంలోకి ఇంకా ఎవరెవరు వస్తారనే దానిపై స్పష్టత లేదు. అయితే, మెజారిటీ కోసం టీవీకే వర్గాలు చర్చలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications