ఎంజీఆర్, ఎన్టీఆర్ దారిలోనే విజయ్! ఏంటా వింత సెంటిమెంట్?
దక్షిణ భారతంలో సినిమా, రాజకీయాలు విడదీయలేని బంధాన్ని కలిగి ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వెండితెరపై ఓ వెలుగు వెలిగి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన నాయకుల జీవితాల్లో సినిమా నటీమణుల పాత్ర, వారి వ్యక్తిగత అనుబంధాలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉన్నాయి. ఎంజీఆర్-జయలలితలతో నేటి విజయ్-త్రిషలను అభిమానులు పోల్చి చూస్తున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో ఓ శకాన్ని శాసించిన ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్), జయలలితలది వెండితెరపై ఓ అద్భుతమైన జోడీ. వారు కలిసి దాదాపు 28 సినిమాల్లో నటించారు. ఎంజీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జయలలితను తన వారసురాలిగా ప్రోత్సహించారు. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదని.. జయలలిత ఆయన జీవితంలో అత్యంత కీలక వ్యక్తి అని అందరికీ తెలిసిన విషయమే. ఎంజీఆర్ మరణం తర్వాత జయలలిత కూడా తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి, తనదైన ముద్ర వేయడం ఓ చారిత్రాత్మక ఘట్టం.

ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నందమూరి తారక రామారావు జీవితంలో లక్ష్మీ పార్వతి ప్రవేశం ఓ కీలక మలుపు. తన భార్య బసవతారకం మరణం తర్వాత, తన జీవిత చరిత్ర రాసేందుకు వచ్చిన లక్ష్మీ పార్వతితో ఎన్టీఆర్కు ఏర్పడిన పరిచయం వివాహానికి దారితీసింది. ఆ సమయంలో ఎన్టీఆర్ రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ.. 1994 ఎన్నికల్లో భారీ మెజారిటీతో మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రాజకీయ జీవితం చివరి అంకంలో లక్ష్మీ పార్వతి పాత్రపై ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. ఆయన వ్యక్తిగత జీవితంలో ఆమెకు ఇచ్చిన ప్రాముఖ్యత అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన దళపతి విజయ్ విషయంలోనూ ఇలాంటి చర్చలే సాగుతున్నాయి. గత కొంతకాలంగా విజయ్, నటి త్రిష మధ్య ఏదో అనుబంధం ఉందనే రూమర్లు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ తన రాజకీయ పార్టీ 'టీవీకే'ను స్థాపించినప్పటి నుంచి త్రిష ఆయనకు మద్దతుగా ఉండటం, 'లియో' వంటి సినిమాల్లో వారి కెమిస్ట్రీ చూసిన అభిమానులు వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే కాదని భావిస్తుంటారు. తాజాగా ఎన్నికల ఫలితాల్లో విజయ్ 100కు పైగా సీట్లతో ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది.
సినీ పరిశ్రమ నుంచి వచ్చి అత్యున్నత రాజకీయ పదవులు చేపట్టిన ఈ ముగ్గురు నేతల జీవితాలను గమనిస్తే.. వారి వ్యక్తిగత అనుబంధాలు ప్రజాదరణపై పెద్దగా ప్రభావం చూపలేదని అర్థమవుతుంది. ఎంజీఆర్, ఎన్టీఆర్, ఇప్పుడు విజయ్.. ఈ ముగ్గురూ తమ సినిమాల ద్వారా సంపాదించుకున్న ఇమేజ్, ప్రజలకు చేసిన సేవలే వారిని గెలిపించాయి. ఈ నాయకుల జీవితాల్లో తోడుగా నిలిచిన మహిళలు ఎవరైనప్పటికీ.. ఓటర్లు మాత్రం వారి నాయకత్వ పటిమను చూసే పట్టం కట్టడం గమనార్హం. వెండితెరపై విజయవంతమైన ఈ జంటలు, రాజకీయాల్లోనూ అదే తరహా పవర్ను ప్రదర్శించడం విశేషం.












Click it and Unblock the Notifications