టార్గెట్ 3 కోట్లు, కానీ వ్యాక్సిన్ 37శాతం మందికే.. లోపమెక్కడ... ఇప్పటికీ సంశయిస్తున్న హెల్త్ కేర్ వర్కర్స్?


ఓవైపు కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి... మరోవైపు చాలా రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ ఇప్పటివరకూ అనుకున్న టార్గెట్‌ను చేరుకోలేకపోయారు. మూడు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ... ఇప్పటివరకూ కేవలం 37శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వడం గమనార్హం.

ఆ లెక్కన 47శాతం మందికి...

ఈ ఏడాది జనవరి 16న దేశవ్యాప్తంగా మొదటి విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో భాగంగా 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ దేశంలో ఇప్పటివరకూ 37శాతం మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి మాత్రమే పూర్తి వ్యాక్సిన్ ఇచ్చారు. మరో 91లక్షల మందికి మొదటి డోసు ఇచ్చారు. నిజానికి దేశవ్యాప్తంగా కేవలం 2.36 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ మాత్రమే వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఈ లెక్కన చూసుకుంటే 47శాతం మంది ఇప్పటివరకూ వ్యాక్సిన్ తీసుకున్నారు.

లోపమెక్కడ...?

చాలా రాష్ట్రాలు ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ని సమీకరించడంలో విఫలమయ్యాయని... అందుకే మొదటి విడతలో తక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ పంపిణీ జరిగిందని అధికారులు చెబుతున్నారు. చాలామంది ప్రముఖులు,ప్రముఖ వైద్యులు వ్యాక్సిన్ తీసుకుని అవగాహన కల్పించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఇప్పటికీ కొంతమంది ఫ్రంట్ లైన్ వర్కర్స్‌ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండిపోయారని పేర్కొన్నారు. మరికొంతమంది అప్పటికే తమ శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి ఉంటాయని... ఇక ఇంజెక్షన్ అవసరం లేదని టీకా వేయించుకోలేదన్నారు.

Advertisement
Advertisement
ఇప్పటికీ సంశయిస్తున్నారు...

హెల్త్ కేర్ వర్కర్స్ వ్యాక్సిన్ తీసుకోవడానికి సంశయించడం ఏవిధంగాను సమర్థినీయం కాదని మణిపాల్ హాస్పిటల్స్ ఛైర్మన్ డా.సుదర్శన్ బల్లాల్ తెలిపారు. హెల్త్ కేర్ వర్కరే వ్యాక్సిన్ తీసుకోవడానికి సంశయిస్తే ఇక మిగతా సమాజానికి దాన్ని సిఫారసు చేయడం సంక్లిష్టమవుతుందన్నారు. ఆదివారం(ఏప్రిల్ 18) ఉదయం 7గంటల సమయం వరకు దేశవ్యాప్తంగా 12.26 కోట్ల వ్యాక్సిన్లను పంపిణీ చేశారు. ఇందులో 45-60ఏళ్ల వయసున్నవారు 10.8లక్షలు కాగా... 60లక్షల వయసు ఉన్నవారు 38.9లక్షలు మంది ఉన్నారు.

ఆ రాష్ట్రాల్లోనే అత్యధికం...


ఇప్పటివరకూ జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో సింహ భాగం మహారాష్ట్ర-1,21,39,453,ఉత్తరప్రదేశ్-1,07,12,739 రాజస్తాన్-1,06,98,771,గుజరాత్-1,03,37,448లోనే జరిగింది. ఒక్కో రాష్ట్రంలో కోటి పైచిలుకు చొప్పున ఈ ఐదు రాష్ట్రాల్లోనే 59.5శాతం వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. ఇక తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో వ్యాక్సిన్ కొరతను నివారించేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కోవాగ్జిన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే యాంటీ వైరల్ డ్రగ్ రెండెసివిర్‌ను మే నాటికి రెట్టింపు సంఖ్యలో ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

Read more about: ఇండియా
Read more...

English Summary

Amid rising Covid-19 cases, reports suggest that only 37 percent frontline workers have been fully inoculated so far. According to a report by The Times of India, against the target of 3 crore, an additional of around 91 lakh frontline workers have got only the first dose