ఇరాన్ తో చర్చల వేళ.. రష్యాకు బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్..
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితి కాస్త తగ్గుముఖం పట్టింది. ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ మేరకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్- అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అటు ఇరాన్, ఇటు అమెరికా బృందాలు ఇస్లామాబాద్ కు చేరుకున్నాయి. ఇక మొదటగా ఇరాన్, అమెరికా ప్రతినిధులతో పాకిస్థాన్ ప్రతినిధులు విడివిడిగా చర్చలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మూడు దేశాల మధ్య త్రైపాక్షిక చర్చలు ప్రారంభం అవుతాయి.
ఇక ఇరాన్ తో చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా వద్ద అత్యధికంగా చమురు ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా చమురు నిల్వలు కలిగిన రష్యా, సౌదీ అరేబియా దేశాల కంటే తమవద్దే నాణ్యమైన చమురు ఉందని తెలిపారు. ఈ మేరకు అమెరికా దిశగా ఖాళీ చమురు ట్యాంకర్లు వస్తున్నాయని చమురును ఎగుమతి చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రపంచ దేశాలకు ట్రంప్ పిలుపు నిచ్చారు.
మరోవైపు ఇరాన్ కు మరోసారి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. చర్చలు విఫలమైతే పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రతరంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్ వైఫల్యం కారణంగా ఇప్పటికే చర్చలు ఐదు గంటలు ఆలస్యం అయ్యాయని స్పష్టం చేశారు. ఇరాన్ తో శాంతి చర్చల వేళ ట్రంప్ వ్యాఖ్యలు పశ్చిమాసియాలో మరోసారి ఆందోళనను పెంచాయి. ఇక ఇస్లామాబాద్ లో ప్రస్తుతం అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. అమెరికా తరపున ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్ హాజరయ్యారు. అలాగే ఇరాన్ తరఫున మహ్మద్ బాకర్ కలిబాఫ్ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్ చేరుకుంది.

మరోవైపు శాంతి చర్చలకు ముందే ఇరాన్ ప్రతినిధులు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో శాంతి చర్చలకు ముందు ఇరాన్ రెండు డిమాండ్స్ పెట్టినట్లు సమాచారం. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల్ని తక్షణమే ఆపి వేయాలని, అలాగే స్తంభింపజేసిన ఆస్తుల్ని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్లు పెట్టినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications