100 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమా ఇదే
తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలోనే తొలిసారిగా 100 రోజులు ఆడి రికార్డు సృష్టించిన చిత్రం పాతాళభైరవి. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై బి.నాగిరెడ్డి, చక్రపాణిలు నిర్మించిన ఈ జానపద చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె.వి. రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. 1951 మార్చి 15న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం, అప్పట్లో భారతీయ సినిమా రంగాన్నే ఆశ్చర్యపరిచే స్థాయిలో విజయాన్ని సాధించింది.
తోట రాముడిగా ఎన్టీఆర్
ఈ సినిమాలో తోట రాముడిగా నటించిన నందమూరి తారకరామారావు సాహసోపేతమైన నటనతో మాస్ హీరోగా గుర్తింపు పొందారు. అలాగే నేపాల్ మాంత్రికుడిగా అద్భుతమైన అభినయాన్ని కనబరిచిన ఎస్.వి. రంగారావు, రాజకుమారి ఇందుమతిగా నటించిన కె. మాలతి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఘంటసాల వెంకటేశ్వరరావు అందించిన సంగీతం, పింగళి నాగేంద్రరావు రాసిన కథ, మాటలు, పాటలు ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాయి.

28 కేంద్రాల్లో 100 రోజులు
విడుదలైన కొత్తలో రెండు వారాల పాటు సాధారణ ప్రదర్శనగా సాగిన ఈ సినిమా, మూడో వారం నుండి ఊహించని రీతిలో ప్రేక్షక ఆదరణ పొందింది. ఆ కాలంలో ఏ తెలుగు సినిమా సాధించని విధంగా ఏకంగా 28 కేంద్రాలలో 100 రోజులు పూర్తి చేసుకుని శతదినోత్సవ రికార్డును నెలకొల్పింది. అంతటితో ఆగకుండా 4 ప్రధాన కేంద్రాలలో 175 రోజులు (సిల్వర్ జూబ్లీ) ఆడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. పాతాళభైరవి కేవలం బాక్సాఫీస్ రికార్డులకే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు అందుకుంది. 1952లో ముంబైలో నిర్వహించిన మొదటి "ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్" లో ప్రదర్శించబడిన ఏకైక దక్షిణ భారత చిత్రంగా నిలిచి, తెలుగు సినిమా ఘనతను దేశవిదేశాల్లో చాటిచెప్పింది














Click it and Unblock the Notifications