‘పెద్ది’ని అడ్డుకుంటున్న కుట్రలో నిర్మాతల వెనక అదృశ్య శక్తి ఎవరు?
అగ్ర నిర్మాతలు, పంపిణీదారులు తెలుగు సినీ పరిశ్రమను ఏ విధంగా తమ గుప్పిట్లోకి తీసుకున్నారో, థియేటర్లను తమ చేతుల్లో పెట్టుకొని తాము చెప్పిన రేటుకే సినిమాలివ్వాలని, అంతే ఇస్తామని పెద్ద నిర్మాతల నుంచి చిన్న స్థాయి నిర్మాతల వరకు అందరినీ బెదిరిస్తున్న ఈ థియేటర్ల మాఫియా వెనక ఎవరున్నారు? అనే చర్చ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తోంది. తాము తీసే సినిమాలకు ఒక రూల్, వేరే వారు తీసే సినిమాలకు మరో రూల్ అన్నట్లుగా అగ్ర నిర్మాతలు వ్యవహరిస్తున్నారు.
తాజాగా దిల్ రాజు టీం నుండి వినిపిస్తున్న మాటలు, ప్రభుత్వాలనే హెచ్చరించేలా ఉన్న తీరు చూస్తుంటే.. అసలు ఈ ఇండస్ట్రీ ఎటు పోతోంది? అన్న సందేహం కలుగుతోంది. థియేటర్లు వర్కౌట్ అవలేదు మూసుకోండి అన్న ఓ నిర్మాత ఇప్పుడు పరిశ్రమలోనే లేడని దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి అనడాన్ని బట్టి దీన్ని ఏవిధంగా అర్థం చేసుకోవాలని? అని సినీ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

అద్దె వర్సెస్ పర్సంటేజీ: అసలు దందా ఇదే!
ప్రస్తుతం ఇండస్ట్రీలో రగులుతున్న ప్రధాన వివాదం 'అద్దె', 'పర్సంటేజీ' విధానం. అగ్ర నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లు సొంతంగా సినిమాలను పంపిణీ చేసినప్పుడు, థియేటర్ల యజమానులకు కేవలం 'అద్దె' మాత్రమే కడతారు. అంటే, సినిమాకు కోట్లు వచ్చినా థియేటర్ ఓనర్కు వచ్చేది మాత్రం ముందే కుదుర్చుకున్న ఫిక్స్డ్ అద్దె మాత్రమే. అదే వేరే నిర్మాతలు లేదా బయటి వ్యక్తులు తమ సినిమాలను అదే థియేటర్లలో విడుదల చేయాలంటే, ఈ పెద్దలు 'పర్సంటేజీ' విధానాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంటే సినిమా వసూళ్లలో సింహభాగం వీరి జేబుల్లోకి వెళ్లాల్సిందే. తాము లాభపడాలి, పక్కవాడు దోపిడీకి గురవ్వాలి అనే ఈ ద్వంద్వ నీతి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తోంది.
ప్రభుత్వాలనే బెదిరించే స్థాయికి అరాచకం
గతంలో టికెట్ రేట్ల విషయంలో అడ్డదిడ్డంగా మాట్లాడిన వారు ఇప్పుడు ఇండస్ట్రీలో లేరని, కేవలం తాము చెప్పిందే వేదమని దిల్ రాజు తరఫున శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. థియేటర్లు వర్కౌట్ అవ్వడం లేదని సాకు చూపుతూ, పరోక్షంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం.. తమకు అనుకూలమైన జీవోలు రాకపోతే సినిమాలు ఆపేస్తామనే రేంజ్లో బెదిరింపులకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అడ్డగోలుగా మాట్లాడే సంస్కృతికి తామే కేరాఫ్ అడ్రస్ అని వీరు నిరూపిస్తున్నారు.
వీరి వెనుక ఉన్న అదృశ్య హస్తం ఎవరు?
ఇంత ధైర్యంగా వీరు అరాచకానికి పాల్పడుతున్నారంటే, దాని వెనుక బలమైన రాజకీయ శక్తులు లేదా అత్యున్నత స్థాయి అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెజారిటీ థియేటర్లను ఈ పెద్దలే లీజుకు తీసుకుని 'సిండికేట్'గా మారారు. ఎవరైనా కొత్త నిర్మాతలు లేదా చిన్న హీరోలు తమకు ఎదురుతిరిగితే, వారికి థియేటర్లు దొరక్కుండా చేయడం, ఉన్నా ప్రైమ్ టైమ్ షోలు ఇవ్వకపోవడం వంటి కుతంత్రాలకు పాల్పడుతున్నారు. ఈ గుత్తాధిపత్యం వల్ల సృజనాత్మకత చచ్చిపోయి, కేవలం వ్యాపార ప్రయోజనాలే పరమావధిగా మారుతున్నాయి.
సగటు ప్రేక్షకుడిని వేధిస్తున్న ప్రశ్న ఇదే
సినిమా అనేది వేల కుటుంబాలకు జీవనాధారం. కానీ కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం పరిశ్రమను విషవలయంగా మారుస్తున్నారు. ఈ అద్దె దందా, పర్సంటేజీ దోపిడీ ఇలాగే కొనసాగితే.. సామాన్య నిర్మాత కనుమరుగయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఈ 'థియేటర్ సిండికేట్'ను అదుపు చేయకపోతే తెలుగు సినిమా కొందరి ప్రైవేట్ ఆస్తిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. తాము సినిమాలిస్తే అద్దె కడతారట.. పక్కవాడు రిలీజ్ చేస్తే పర్సంటేజీ కావాలట-ఈ అన్యాయానికి ముగింపు ఎప్పుడన్నదే ఇప్పుడు సగటు సినీ ప్రేక్షకుడిని వేధిస్తున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం కనుక్కొనాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది.












Click it and Unblock the Notifications