చిరంజీవి ‘ఠాగూర్’ సినిమా విషయంలో జరిగిన పెద్ద గొడవ ఏంటి?
వి.వి.వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఠాగూర్ సినిమా సంచలన విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా, మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన రమణ సినిమాకు రీమేక్. వాస్తవానికి ఈ సినిమా తమిళంలో విడుదలై సంచలన విజయాన్ని దక్కించుకున్న సమయంలో తెలుగు స్టార్ హీరో రాజశేఖర్ ఈ సినిమాను చూశారు.
అందులో ఉన్న సామాజిక సందేశం తన ఇమేజ్ కు బాగా సరిపోతుందని భావించి తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారు. హక్కుల కోసం నిర్మాతలతో సంప్రదింపులు జరిపారు. ఇలా రాజశేఖర్ నిర్మాతలతో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఠాగూర్ సినిమా తీసిన నిర్మాత మధు రంగప్రవేశం చేశారు. రాజశేఖర్ ఇచ్చేదానికన్నా తాను ఎక్కువగా డబ్బులు ఆశ చూపి హక్కులను కొనుక్కెళ్లారు.

మెగా అభిమానుల ఆగ్రహం
మధు ఈ కథను చిరంజీవికి వినిపించగా, ఆయనకు నచ్చింది. వెంటనే పచ్చజెండా ఊపడంతో వినాయక్ దర్శకత్వంలో సినిమా ప్రారంభమై, విడుదలైంది. అయితే న్యాయంగా తమకు దక్కాల్సిన కథను చిరంజీవి 'లాక్కొన్నారని' రాజశేఖర్, జీవిత దంపతులు మీడియా ముందు ఆరోపణలు చేశారు. ఒక పెద్ద హీరో అయి ఉండి, ఇతర హీరోలు అనుకున్న కథలను ఇలా తీసుకోవడం ధర్మం కాదని వారు బహిరంగంగానే విమర్శించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారాన్ని రేపడంతోపాటు సంచలనాన్ని కూడా సృష్టించాయి. చిరంజీవిపై రాజశేఖర్ దంపతులు చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ప్రస్తుతం కొనసాగుతున్న సత్సంబంధాలు
'ఠాగూర్' సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలో చిరంజీవి నటన, మేనరిజమ్స్ చూసిన తర్వాత, ఆ పాత్రకు ఆయనే సరైన న్యాయం చేయగలరని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. కాలక్రమేణా రాజశేఖర్ కూడా తన ఆవేశాన్ని తగ్గించుకున్నారు. చిరంజీవితో మళ్ళీ సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. చిరంజీవి అయితేనే తనకన్నా ఆ పాత్రకు బాగా న్యాయం చేయగలరన్నారు. తర్వాత చిరంజీవి, రాజశేఖర్ మధ్య గొడవలు తగ్గిపోయాయి. ప్రస్తుతం సత్సంబంధాలే కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications