పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్: ఉద్యోగస్తులు సహకరిస్తారా..? వాట్ నెక్ట్స్..?
అమరావతి: పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో జగన్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే దాన్ని కొట్టేసింది. ఎన్నికలను వాయిదా వేయడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు తమ విధుల్లో పాల్గొనకుండా ఇలా పిటిషన్లను దాఖలు చేయడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సిందిగా ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్పై న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ హృషికేష్ రాయ్లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఇదివరకు హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఎన్నికలపై స్టే ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు.
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ ఉద్యోగ సంఘాలు ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరిస్తారని భావిస్తున్నారా.. లేక ఉద్యోగస్తులు ప్రాణాలకు గ్యారెంటీ ఎన్నికల సంఘం ఇవ్వాలనే వాదనపై మీరు ఏకీభవిస్తారా... దీనిపై సమాధానం కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.