చంద్రబాబు, జగన్ మేనిఫెస్టోల్లో దేన్ని నమ్ముతారు? మీ కామెంట్ ఏంటి ?
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, వైసీపీలు ఓటర్లకు గాలమేసే పనిలో పడ్డాయి. భారీ హామీలతో మేనిఫెస్టోలు విడుదల చేశాయి. వేల కోట్ల రూపాయల వ్యయంతో కూడిన హామీలివ్వడంలో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. మీ భవిష్యత్తుకు నాది భరోసా అంటూ చంద్రబాబు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనంటూ జగన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
రైతులు, మహిళలు, యువత లక్ష్యంగా టీడీపీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. రైతన్నలకు అన్నదాత సుఖీభవ, ఉచిత పంటల బీమా, పగటిపూట 12 గంటల ఉచిత కరెంట్తో పాటు పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ప్రకటించింది. డ్వాక్రా మహిళలకు మరో ఐదేళ్లు పసుపు కుంకుమ కొనసాగించడంతో పాటు వారికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తామని చెప్పింది. యువతను ఆకట్టుకునేందుకుగానూ నిరుద్యోగ భృతిని 3వేలకు పెంచడంతో పాటు ఇంటర్ పాసైన వారికి నిరుద్యోగ భృతి పథకాన్ని అమలుచేస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. వీటితో పాటు బీసీలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, వైద్యానికి సంబంధించి కోట్ల రూపాయలు ఖర్చుచేయనున్నట్లు చెప్పింది.
మరోవైపు వైసీపీ సైతం భారీ స్థాయిలో హామీలు గుప్పించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేశాకే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని జగన్ స్పష్టం చేశారు. నాలుగు పేజీల మేనిఫెస్టోలో అన్ని వర్గాల వారిపై వరాల జల్లు కురిపించిన వైసీపీ అధినేత... రైతులకు ఏటా 12500 పెట్టుబడి సాయం అందించడంతో పాటు వడ్డీలేని రుణాలు, ఫ్రీగా బోర్లు వేయిస్తామని మాట ఇచ్చారు. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఏడాదికి రూ.10వేల సాయం, నేతన్నలకు రూ. 24వేలు, కులవృత్తులవారికి సున్నా వడ్డీకే రూ.10వేల రుణం ఇస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ మైనార్టీల సంక్షేమం, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, మూడు దశల్లో మద్యపాన నిషేధం, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని ప్రకటించారు. ఇలాంటి భారీ హామీలతో చంద్రబాబు, జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలతో ఏది నమ్మశక్యంగా ఉందని మీరు భావిస్తున్నారు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.