టీవీ9లో జరుగుతున్న రచ్చపై మీ కామెంట్ ఏంటి?
హైదరాబాద్ : సంచలనాల టీవీ9 ఇప్పుడు తానే ఒక సంచలనంగా మారింది. యాజమాన్య బదిలీ విషయంలో తలెత్తిన వివాదం ఛానెల్ మాజీ సీఈఓ రవి ప్రకాశ్కు ముచ్చెమటలు పట్టించింది. కొద్ది రోజుల క్రితం ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి టీవీ 9ను అలంద మీడియా టేకోవర్ చేసింది. అయితే ఆ డీల్ కంప్లీట్ కాకుండా రవి ప్రకాశ్ అడ్డుపడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే తన సంతకం ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడం, సైబర్ క్రైమ్ పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించడం, టీవీ 9 ఆఫీసులోనూ కొన్ని కంప్యూటర్లను పరిశీలించడం సంచలనం సృష్టించింది.
వివాదం నేపథ్యంలో రవిప్రకాశ్ పత్తాలేకుండా పోయారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాత్రి 7పీఎం షోలో ఆయన ప్రత్యక్షమ్యారు. తననెవరూ అరెస్ట్ చేయలేదని, ఎక్కడికీ పారిపోలేదని, తనపై వచ్చిన పుకార్లపై ఎవరూ ఆందోళన చెందొద్దని అన్నారు. ఈ నెల 16న ఎన్సీఎల్టీ కోర్టులో కేసు విచారణ ఉందని, ఈ వివాదంతో కొందరు తనపై తప్పుడు కేసులు బనాయించే కుట్రపన్నుతున్నారని ఆయన ఆరోపించారు. టీవీ 9 ఫౌండర్గా, సీఈఓగా 15ఏళ్లుగా ఇక్కడే బాధ్యతలు నిర్వర్తిస్తున్న తాను సమాజహితం కోసం పనిచేస్తున్నానని చెప్పుకొచ్చారు. తన విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించి క్రెడిబిలిటీ కోల్పోవద్దని హితవుపలికారు.
ఇదిలా ఉంటే టీవీ 9 ఛానెల్కు సంబంధించి తన సంతకం ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కార్యదర్శి కౌశిక్ రావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. రవి ప్రకాశ్పై రెండు క్రిమినల్ కేసులు నమోదుచేశారు. దీనికి సంబంధించి రవిప్రకాశ్తో పాటు సినీ నటుడు శివాజీకి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 11గంటలలోపు విచారణకు హాజరుకావాలని గచ్చిబౌలి సైబర్ క్రైం పోలీసులు ఆదేశించారు. టీవీ 9లో జరుగుతున్న రచ్చ, తాను ఇప్పటికీ టీవీ 9 సీఈఓనంటున్న రవి ప్రకాశ్ వ్యాఖ్యలు, పోలీసుల నోటీసులు తదితర పరిణామాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.