JEE Advanced: జేఈఈ అడ్వాన్సెడ్ పరీక్షపై సుప్రీం కీలక తీర్పు-వారికి మూడో ఛాన్స్..!
జేఈఈ అడ్వాన్సెడ్ పరీక్షలో రెండుసార్లు అర్హత సాధించని వారికి మూడో సారి రాసేందుకు అనుమతి ఇవ్వకుండా జాయింట్ అడ్మిషన్ బోర్డ్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. ఈ నిర్ణయం చెల్లదని పేర్కొంది. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మూడు సార్లు పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చి, ఆ తర్వాత ఉపసంహరించుకోవడం కుదరదని తెలిపింది. రెండుసార్లు అర్హత సాధించకుండా కాలేజీల్లో చేరిపోయిన వారు తిరిగి మూడోసారి పరీక్ష రాయకుండా అనర్హుల్ని చేయడం కరెక్టే అన్న కేంద్రం వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
2023, 2024, 2025లో 12వ తరగతి (ఇంటర్ సెకండియర్) చదువుతూ జేఈఈ అడ్వాన్సెడ్ పరీక్షలు రాసే వారికి మూడుసార్లు వీటిని రాసేందుకు నోటిఫికేషన్ లో అనుమతి ఇచ్చారు. అయితే మధ్యలో దీన్ని రెండు సార్లకు తగ్గించారు. దీంతో అప్పటికే మూడోసారి పరీక్ష రాసే ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజీలు మానేసిన వారి పరిస్ధితి అగమ్య గోచరంగా మారింది. ఈ నేపథ్యంలో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ కీలక ఆదేశాలు ఇచ్చింది.

ఇలా గతేడాది నవంబర్ 5-18 తేదీల మధ్య కాలేజీలు మానేసిన వారికి మూడోసారి జేఈఈ అడ్వాన్సెడ్ పరీక్ష రాసేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే కోర్టును ఆశ్రయించిన వారికే దీన్ని పరిమితం చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్లో రెండుసార్లు విఫల ప్రయత్నాల తర్వాత విద్యార్థులు తమ ప్రస్తుత కోర్సులపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించడం ద్వారా విద్యాపరమైన అంతరాయాన్ని తగ్గించడమే సవరించిన విధానం లక్షమన్న కేంద్రం వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు.
నోటిఫికేషన్ లో ఇచ్చిన వెసులుబాటును మధ్యలో ఉపసంహరించుకోవడం కుదరదని తేల్చిచెప్పేసింది.












Click it and Unblock the Notifications