విజయవాడలో మెగా జాబ్ మేళా ప్రారంభం- 60 కంపెనీల్లో ఉద్యోగాలు..!
విజయవాడలో ఇవాళ మెగా జాబ్ మేళా ప్రారంభమైంది. మొగల్రాజపురంలోని సిద్ధార్ధ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో వికసిత్ భారత్ పేరుతో ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. స్థానిక ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, బోండా ఉమ, గద్దె రామ్మోహన్ తో పాటు పలువురు నాయకులు జాబ్ మేళా ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
విజయవాడలో ఇవాళ ప్రారంభమైన మెగా వికసిత్ జాబ్ మేళాలో మొత్తం 60 కంపెనీలు పాల్గొంటున్నాయి. దాదాపు అన్ని విద్యార్హతల ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. వివిధ రంగాలకు చెందిన కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. పదో తరగతి నుంచి అన్ని విద్యార్హత ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. అలాగే విద్యార్హతలు, ఇతర అర్హతల ఆధారంగా జీతాలు కూడా ఆఫర్ చేస్తున్నారు. దీంతో దాదాపు 2000 మంది నిరుద్యోగులు ఆన్ లైన్లో, 3 వేల మంది ఆఫ్ లైన్లో ఈ జాబ్ మేళాకు దరఖాస్తు చేసుకున్నారు.

ఇవాళ మెగా జాబ్ మేళాకు విజయవాడ నగరంతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా నిరుద్యోగులు హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని.. ఒకప్పుడు చంద్రబాబు విజన్ 2020 అంటే నవ్వారని, ఇప్పుడు ఐటీ కంపెనీలు మన రాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు.
దేశంలో రెండు పెద్ద నగరాలు నిర్మించిన ఘనత చంద్రబాబుదే అన్నారు. అందులో ఒకటి హైదరాబాద్, రెండు అమరావతి అని తెలిపారు జనవరి 5వ తేదీన MSME అవగాహన సదస్సు జరుగుతుందని, ప్రతి ఒక్క నియోజకవర్గంలో జాబ్ మేళా ఏర్పాటు చేస్తామని చిన్ని తెలిపారు. కేవలం IT వాళ్ళకే కాకుండా 10వ తరగతి చదువుకున్న వారికి కూడా జాబ్ రావాలన్నారు.












Click it and Unblock the Notifications