టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురి అరెస్ట్: సెంచరీ దిశగా అరెస్టులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. తాజాగా, బుధవారం ఈ కేసులో మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ బంధువులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ప్రవీణ్కి వారు సహకరించారని అధికారులు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకూ అరెస్ట్ అయిన వారి సంఖ్య 99కి చేరింది.
మరోవైపు, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఏ-2గా ఉన్న రాజశేఖర్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో మరోసారి తిరస్కరణకు గురైంది. దీంతో ఆయన బెయిల్ పిటిషన్ మూడుసార్లు తిరస్కరణకు గురైనట్లు అయ్యింది. సిట్ అధికారులు నిందితుల నుంచి సేకరించిన సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు,
హార్డ్డిస్క్లను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు..

ఆ నివేదిక రాగానే అనుబంధ అభియోగపత్రం దాఖలు చేస్తామని సిట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 37మందితో సిట్ అధికారులు అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన నిందితులను జులైలో 10న 18 మందిని, 11వ తేదీన ముగ్గురిని, 12న మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.
కరీంనగర్లో తండ్రి, కూతుర్లలను కూడా అధికారులు అరెస్ట్ చేశారు. మద్దెల శ్రీనివాస్, ఆయన కుమార్తె సాహితి ఏఈ పరీక్ష పేపర్ కోసం రమేశ్ కుమార్ సహాయం కోరాడు. రూ.30 లక్షలు ఒప్పందంతో మాస్ కాపీయింగ్ ద్వారా పరీక్షను రాయించాడు. ఈ వివరాలు వెలుగులోకి రావడంతో తండ్రి, కుమార్తెలను జులై 12న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
కాగా, ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, మరికొందరు నిందితుల అరెస్టులు పెరిగే అవకాశం ఉందని సిట్ అధికారుల వెల్లడించారు. దాదాపు ఐదు నెలలుగా జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కనీసం 150 మంది వరకూ అరెస్టవుతారని అధికారులు అంచనావేస్తున్నారు.
చాలామంది అభ్యర్థులు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారని దర్యాప్తులో వెల్లడవుతోంది. ఓ అభ్యర్థి రూ.30 లక్షలు చెల్లించి ఏఈ ప్రశ్నపత్రాన్ని కొన్నాడని అధికారులు గుర్తించారు. ఏఈ ప్రశ్నపత్రం అమ్మడం ద్వారానే ఓ వ్యాపారి రూ.2.5 కోట్లు వరకు వసూలు చేశాడని అధికారులు తెలిపారు. ఇలా అనేక మంది పెద్ద మొత్తంలో నగదు చెల్లించి టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు కొనుగోలు చేశారు.












Click it and Unblock the Notifications