బలవంతంగా ఆ పని చేయించారు.. ఏడ్చినా వదల్లేదు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
90వ దశకంలో తెలుగు, తమిళ చిత్రాలతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ మోహిని తన సినీ జీవితంలోని కొన్ని చేదు అనుభవాలను, చేజారిన ముఖ్యమైన అవకాశాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడి క్రైస్తవ మత ప్రచారకురాలిగా కొత్త జీవితాన్ని గడుపుతున్న మోహిని.. సినీ ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి వెల్లడించి ఆవేదన వ్యక్తం చేశారు. బాలనటిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి బాలకృష్ణతో 'ఆదిత్య 69', చిరంజీవితో 'హిట్లర్' వంటి అద్భుత చిత్రాలలో నటించి అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది.
ఆ సీన్ కోసం బలవంతం చేశారు..
ప్రముఖ నటి మోహిని తన సినీ జీవితంలో ఎదుర్కొన్న బాధాకరమైన సంఘటనల్లో ఒకటి తమిళ చిత్రం 'కన్మణి' షూటింగ్ సమయంలో జరిగిందని ఆమె వెల్లడించింది. ఆ సినిమా దర్శకుడు ఆర్.కే. సెల్వమణి ఒక స్విమ్మింగ్ పూల్ సన్నివేశం కోసం తనను స్విమ్సూట్ ధరించమని బలవంతం చేశారని మోహిని ఈ సందర్భంగా చెప్పారు. తనకు అసలు ఈత రాదని చెప్పినా.. ఆ సీన్లో నటించడానికి తనకు ఇష్టం లేదని ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె వాపోయారు."గుండెల నిండా బాధతో, కన్నీళ్లు పెట్టుకుని ఆ సన్నివేశాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. అది తప్ప, నా కెరీర్లో గ్లామర్ పాత్రలకు నేను ఎప్పుడూ దూరంగానే ఉన్నాను" అని మోహిని భావోద్వేగంతో వెల్లడించారు. తాను ఎప్పుడూ గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యత ఇవ్వలేదని, కానీ ఆ ఒక్క సన్నివేశం తనను చాలా బాధించిందని ఆమె చెప్పారు.

మోహినికి చేజారిన గొప్ప అవకాశాలు
నటి మోహిని తన సినీ ప్రయాణంలో చేజారిన కొన్ని ముఖ్యమైన సినీ అవకాశాల గురించి కూడా బాధపడ్డారు. ముఖ్యంగా రజనీకాంత్ నటించిన 'ముత్తు', సూర్య నటించిన 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' వంటి సినిమాల్లో తనకు కీలక పాత్రలు రావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాటిని కోల్పోయానని ఆమె చెప్పారు."రజనీకాంత్ను కలవమని ఒకరు సలహా ఇచ్చారు. కానీ ఆ సమయంలో నేను దానిని పట్టించుకోలేదు. దాని వల్ల ఆ అవకాశం నా చేతిలోంచి జారిపోయింది," అని ఆమె విచారం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం, కొన్నిసార్లు నటులు తమకు ఇష్టం లేని పాత్రలను, సీన్లను చేయాల్సి వస్తుందని మోహిని అనుభవాలు మరోసారి రుజువు చేశాయి. తన కష్టాలు ఆవేదనను పంచుకున్న మోహిని, ప్రస్తుతం తన ఆధ్యాత్మిక జీవితంలో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications