హీరో రవితేజను మోసం చేసి 25 ఎకరాలు కొన్న బండ్ల గణేష్
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ విషయాన్నైనా ఓపెన్గా, నిర్భయంగా చెప్పే వ్యక్తుల్లో నిర్మాత బండ్ల గణేష్ ఒకరు. మాట్లాడితే వివాదాలు రాజేసే బండ్ల, తాను చేసిన తప్పులను కూడా అంతే ధైర్యంగా ఒప్పుకుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, 'మాస్ మహారాజా' రవితేజను ఒక రియల్ ఎస్టేట్ వ్యవహారంలో ఎలా అబద్ధం చెప్పి మోసం చేసిందీ, ఆ తర్వాత ఏం జరిగిందో వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అసలేం జరిగిందంటే?
గతంలో బండ్ల గణేష్కి చెందిన 30 ఎకరాల పొలాన్ని అమ్మేందుకు ఓ కొనుగోలుదారుడు వచ్చాడట. అయితే, ఆ పక్కనే ఉన్న మరో 25 ఎకరాలు కూడా కలిపి ఇస్తేనే మొత్తం కొంటానని అతను కండిషన్ పెట్టాడు. తీరా చూస్తే, ఆ పక్కనున్న పొలంలో కొంత భాగం నటుడు రవితేజకు చెందినది. ఎలాగైనా ఆ ల్యాండ్ తన హస్తగతం చేసుకోవాలని భావించిన గణేష్, రవితేజ వద్దకు వెళ్లి ఓ పెద్ద అబద్ధం ఆడేశారు. ప్రభుత్వం ఆ భూములను స్వాధీనం చేసుకోబోతోందని, కాబట్టి ఇప్పుడే అమ్మేస్తే మంచిదని రవితేజను నమ్మించారు. బండ్ల గణేష్ చెప్పిన మాటలను పూర్తిగా విశ్వసించిన రవితేజ, తన భూమిని అమ్మేశారు.

బండ్ల గణేష్ క్షమాపణలు, రవితేజ ఊహించని రియాక్షన్
ఆ భూమిని దక్కించుకున్నప్పటికీ, రవితేజ లాంటి ఒక మంచి వ్యక్తిని మోసం చేశాననే భావన బండ్ల గణేష్ మనసును బాగా తొలచివేసింది. "రవితేజతో సినిమా చేస్తేనే నాకు 5 కోట్ల లాభం వచ్చింది, అలాంటి మనిషినా నేను మోసం చేశాను?" అని తీవ్రమైన పశ్చాత్తాపానికి గురయ్యారు. మనసు నిలవక కొన్నాళ్లకు నేరుగా రవితేజ దగ్గరకు వెళ్లి, ఆ రోజు తాను అబద్ధం చెప్పి పొలాన్ని తీసుకున్నానని ఒప్పుకుని క్షమాపణలు కోరారు. అయితే, ఆ సమయంలో రవితేజ స్పందించిన తీరు బండ్ల గణేష్ను షాక్కు గురిచేసింది.
రవితేజ ఎలాంటి కోపం గానీ, ఆవేశం గానీ చూపించకుండా.. "నాకు ఆ రోజే ఆ విషయం తెలుసురా!" అని చాలా ప్రశాంతంగా ఒక్క మాటతో తేల్చేశారు. విషయం మొత్తం తెలిసినా కూడా తనపై ఎలాంటి కోపం లేకుండా, పగ పెంచుకోకుండా ఉన్న రవితేజ సంస్కారానికి, పెద్ద మనసుకు బండ్ల గణేష్ జోహార్లు అర్పించారు. ఎవరిపైనా ద్వేషం పెంచుకోని రవితేజ రుణం ఏదో ఒక రోజు కచ్చితంగా తీర్చుకుంటానని గణేష్ ఎమోషనల్ అయ్యారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రవితేజ గొప్పదనానికి ఈ సంఘటనే ఒక నిదర్శనం!














Click it and Unblock the Notifications