పవన్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు కరువు..? షాకిచ్చిన బడా నిర్మాతలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'హరిహర వీరమల్లు' చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనేక వాయిదాల తర్వాత, ఈ భారీ బడ్జెట్ చారిత్రక యాక్షన్ డ్రామా జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పింది.
టీమ్ ఇప్పటికే ప్రమోషన్లను ముమ్మరం చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను తారా స్థాయికి చేర్చింది. పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చూడని లుక్లో, శక్తివంతమైన బందిపోటు వీరమల్లుగా కనిపించి అభిమానులను ఉర్రూతలూగించారు. ఔరంగజేబు కాలం నాటి చారిత్రక నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రంలో, బందిపోటు వీరమల్లు కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావడమే తన లక్ష్యంగా పని చేయబోతున్నట్టు ట్రైలర్ స్పష్టం చేసింది. ఇది దేశభక్తి, వీరోచిత పోరాటాల కలయికగా కనిపించడం ఆసక్తికరంగా మారింది.

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ నెగటివ్ పాత్రలో (ఔరంగజేబుగా) కనిపించనున్నారు. వారి నటన సినిమాకు మరింత బలాన్ని చేకూర్చనుంది.ఇక సినిమా టైటిల్ గురించి టీమ్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. "విష్ణువు, శివుడు కలిపిన అవతారం వీరమల్లు" అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే 'హరిహర వీరమల్లు'సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
సీడెడ్లో సినిమాకు బాగానే బిజినెస్ జరుగుతున్నప్పటికీ, మిగిలిన ఏరియాల్లో మాత్రం సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు కరువు అయ్యారనే ప్రచారం జరుగుతోంది. నైజాం, వైజాగ్, బెంగళూరు, నెల్లూరు, చెన్నై (Chennai)వంటి ఏరియాల్లో హరిహర వీరమల్లుకు బిజినెస్ జరగలేదట. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, టాలీవుడ్లోని బడా నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్, దిల్ రాజు, ఏషియన్ సునీల్ వంటివారు కూడా 'హరిహర వీరమల్లు' రైట్స్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో, విడుదలకు ముందు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, సినిమా నిర్మాత ఏ.ఎం. రత్నం నైజాం ఏరియాలో సినిమాను స్వయంగా విడుదల చేసుకోవాలని నిర్ణయించుకున్నారట.
నైజాంలో పవన్ కళ్యాణ్కు మంచి క్రేజ్ ఉన్నప్పటికీ, ఈ ఏరియాలో బయ్యర్లు ముందుకు రాకపోవడానికి ఒక ప్రధాన కారణం చెబుతున్నారు. నైజాం ఏరియా రైట్స్ కోసం నిర్మాత దాదాపు రూ. 50 కోట్లు అడ్వాన్స్గా డిమాండ్ చేశారట. ఇంత భారీ మొత్తాన్ని అడ్వాన్స్గా ఇవ్వడానికి ఏ బయ్యర్ కూడా ముందుకు రాకపోవడంతో, చివరికి నిర్మాతనే స్వయంగా నైజాంలో సినిమాను రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం. ఇది 'హరిహర వీరమల్లు' సినిమా బడ్జెట్, బిజినెస్ విషయంలో సినీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.












Click it and Unblock the Notifications