'ఇరుముడి' చైల్డ్ ఆర్టిస్ట్కు గోల్డెన్ ఆఫర్!
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటించిన 'ఇరుముడి' చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ నక్షత్రకు సినీ ఇండస్ట్రీ మంచి గుర్తింపు లభించింది. ఈ చిత్రంలో రవితేజ కూతురిగా నక్షత్ర నటించిన తీరు, పండించిన ఎమోషన్స్ ప్రేక్షకులనే కాకుండా సినీ ప్రముఖులను కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో నక్షత్రకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఓ భారీ ఆఫర్ లభించింది. భవిష్యత్తులో నక్షత్ర యాక్టింగ్ ను తన కెరీర్గా ఎంచుకుని సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలని భావిస్తే.. ఆమెను హీరోయిన్ గా పరిచయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నిర్మాత రవిశంకర్ బహిరంగంగా ప్రకటించారు.
'ఇరుముడి' సినిమాలో నక్షత్ర యాక్టింగ్ ను ప్రత్యేకంగా కొనియాడిన ప్రొడ్యూసర్ రవిశంకర్.. ఆమెకు హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంటే తన సొంత కూతురిలా భావించి ఓ పెద్ద ప్రాజెక్టుతో గ్రాండ్గా లాంచ్ చేస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ సినిమాలో తనకు అవకాశం ఎలా దక్కిందో నక్షత్ర ఇటీవలే ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. డైరెక్టర్ శివ నిర్వాణ ఇన్స్టాగ్రామ్లో ఆమె చేసిన రీల్స్ చూసి.. ఆమెలోని యాక్టింగ్ టాలెంట్ను గుర్తించి ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం ఎంపిక చేశారని నక్షత్ర వెల్లడించింది.

ప్రస్తుతానికి ఈ ఆఫర్ తక్షణమే చేపట్టే ప్రాజెక్టు కాకపోయినప్పటికీ.. నక్షత్ర తన చదువు పూర్తయ్యాక లేదా భవిష్యత్తులో నటిగా స్థిరపడాలని నిర్ణయించుకుంటే.. ఇది ఆమెకు చాలా ఛాన్సుగా మారనుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అగ్రగామి నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఇప్పటికే ఈ చైల్డ్ ఆర్టిస్టుపై ఇంతటి నమ్మకాన్ని వ్యక్తం చేయడం ఆమె ప్రయాణానికి శుభసూచకమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications