చిరంజీవి గుండెలో దిగబడిన మేకుకు ఏడాది పూర్తి
మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేసే విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఒకటికి రెండుసార్లు కథను వింటారు. మొన్నటివరకు అల్లు అరవింద్ కూడా కథ విని అనుమతిచ్చిన తర్వాత సినిమా పట్టాలెక్కేది. సినిమా చేసే విషయంలో చిరు ఎంత జాగ్రత్తగా ఉంటారు అనే సంఘటనలకు పరిశ్రమలో ఎంతోమంది ఎన్నో ఉదాహరణలు చెప్పేవారు. అటువంటి చిరంజీవి కూడా తనవాడు.. తనను నమ్ముకున్నవాడు.. అతనికి మంచి భవిష్యత్తునివ్వాలి అని ఆలోచించి సినిమాను ఎంపిక చేసుకునే విషయంలో పట్టాలు తప్పారు.
అలా పట్టాలు తప్పి.. తనవాడికి అవకాశం ఇవ్వడంతో ప్రేక్షకుల గుండెల్లో మేకులా దిగబడిన చిత్రమే భోళాశంకర్. ఈ చిత్రం గతేడాది ఆగస్టు 11వ తేదీన విడుదలై చిరంజీవి కెరీర్ లో మాయని మచ్చలా మిగిలింది. ఇంత భారీ ఫ్లాప్ సినిమాను చిరంజీవి ఎప్పుడూ మూటకట్టుకోలేదు. ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి అభిమానులు వద్దు వద్దు అని చెబుతూనే ఉన్నారుకానీ ఆ సమయంలో ఆయనకు తనను ఇంతవాడిని చేసిన అభిమానులకన్నా మెహర్ రమేష్ మాత్రమే ఎక్కువయ్యాడు. ఎందుకంటే చిరంజీవి ఆర్థిక వ్యవహారాలను దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారు కాబట్టి. అభిమానులే లేకపోతే ఆర్థిక వ్యవహారాలు ఎక్కడుండేవి అనే విషయం ప్రస్తుతం అప్రస్తుతం.

తమిళంలో అజిత్ కథానాయకుడిగా తెరకెక్కిన వేదాళం సినిమాను కొన్ని మార్పుచేర్పులతో పట్టాలెక్కించారు. ఈ కథపై పది సంవత్సరాలుగా కసరత్తులు చేస్తున్నానంటూ మెహర్ రమేష్ ఆర్భాటంగా చెప్పేవారు. చివరకు ఆ సినిమా పదిరోజులు కూడా ఆడకుండా పోయింది. కాలం చెల్లిన కథను రీమేక్ రూపంలో తీసుకువచ్చి మేకులా దింపారు.
'ఏకే ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ పై అనిల్ సుంకర్ ఈ సినిమాతోపాటు ఏజెంట్ కూడా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. చిరంజీవికి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్, హీరోయిన్ గా తమన్నా, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు. థియేటర్లలో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.79 కోట్ల షేర్ లక్ష్యంతో విడుదలై కేవలం రూ.29.33 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. నిర్మాత రూ.50 కోట్లు నష్టపోయారు. మొదటిరోజు మొదటి ఆట నుంచే సినీ ప్రియులు భోళాశంకర్ ను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.












Click it and Unblock the Notifications