రూ. 100 కోట్ల స్కామ్.. ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్!
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ క్రేజ్ను అడ్డుపెట్టుకుని భారీ కుంభకోణానికి తెరలేపిన వైనం టాలీవుడ్లో కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ పేరుతో దాదాపు రూ.100 కోట్ల నిధుల సేకరణకు కొందరు కేటుగాళ్లు ప్లాన్ చేయగా.. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ఎన్టీఆర్ టీమ్ అప్రమత్తమైంది. ఈ భారీ కుంభకోణం గురించి అభిమానులను, ప్రజలను హెచ్చరిస్తూ ఎన్టీఆర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
రూ.100 కోట్ల చారిటీ పేరుతో కుట్ర
ఎన్టీఆర్ పేరుతో ఓ హెల్త్ చారిటీని ప్రారంభించి, ఆన్లైన్ ద్వారా విరాళాలు సేకరించేందుకు ఓ ముఠా కుట్ర పన్నింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆరోగ్య రంగంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని.. దీనికోసం సుమారు రూ.100 కోట్ల నిధిని సేకరిస్తున్నామని సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. ముఖ్యంగా 'ఊరు వాడ' అనే సోషల్ మీడియా అకౌంట్ ద్వారా నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవ చేస్తామంటూ పోస్టర్లు సృష్టించి, విరాళాలు తమ అకౌంట్లలో జమ చేయాలని కోరారు.

అప్రమత్తమైన ఎన్టీఆర్ టీమ్
ఈ వ్యవహారం ఎన్టీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా, అభిమానులను మోసం చేసేలా సాగుతున్న ఈ విరాళాల సేకరణతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కార్యాలయం జారీ చేసిన ప్రకటనలో.. "కొన్ని ఫ్యాన్స్ గ్రూపులు చారిటీ పేరుతో నిధులు సేకరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి గ్రూపులకు కానీ, ఆ కార్యక్రమాలకు కానీ ఎన్టీఆర్కు ఎటువంటి సంబంధం లేదు" అని తేల్చి చెప్పారు.
#NTR’s office clarified that he is not associated with any charity drives or fundraisers being conducted in his name.
— Filmyscoops (@Filmyscoopss) May 13, 2026
Any official initiative will only be announced directly by NTR or his office. pic.twitter.com/8eapOJz0TS
అభిమానులకు ఎన్టీఆర్ వార్నింగ్
తన పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, శ్రేయోభిలాషులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎన్టీఆర్ సూచించారు. ఒకవేళ భవిష్యత్తులో ఎన్టీఆర్ ఏదైనా స్వచ్ఛంద కార్యక్రమం చేయాలనుకుంటే.. దానికి సంబంధించిన ప్రకటన స్వయంగా ఆయన నుంచే వస్తుందని స్పష్టం చేశారు. నకిలీ ప్రకటనలను ప్రోత్సహించవద్దని కోరుతూ, తమకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
డ్రాగన్గా ఎన్టీఆర్ బిజీ
సినిమాల విషయానికి వస్తే, ఎన్టీఆర్ ఇటీవల 'వార్ 2' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సందడి చేశారు. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.












Click it and Unblock the Notifications