ఏపీ, తెలంగాణకు భారీ విరాళం ప్రకటించిన ప్రభాస్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తాయి. తెలంగాణలోని ఖమ్మంపై మున్నేరు నది విరుచుకుపడటంతో ఆ నగరం నీటి మునిగింది. అలాగే బుడమేరు వాగు పొంగడంతో విజయవాడ మునిగిపోయింది. వరద బాధితులను ప్రభుత్వాలు సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు ఆహారం, పాలప్యాకెట్లు, బిస్కెట్లు అందజేస్తున్నారు. ఏపీలో అక్షయ పాత్రద్వారా లక్షల మందికి అన్నదానం జరుగుతోంది.
విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న రెండు తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన సెలబ్రిటీలంతా ముందుకు వస్తున్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ సాయం చేయడానికి ముందుకు వచ్చే ప్రభాస్ మరోసారి రెండు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. ఏపీకి రూ.1 కోటి, తెలంగాణకు రూ.1 కోటి చొప్పున మొత్తం రూ.2 కోట్ల సాయాన్ని ప్రకటించారు. అంతేకాదు వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు భోజనంతోపాటు మంచినీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రభాస్ భూరి విరాళంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికీ సినీ రంగం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు, చిరంజీవి కోటి రూపాయలు, మహేష్ బాబు కోటి రూపాయలు, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అశ్వనీదత్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సూర్యదేవర నాగవంశీ, చినబాబు, వెంకీ అట్లూరి.. తదితరులంతా సాయాన్ని ప్రకటించారు. అయితే అశ్వనీదత్ ఏపీ రాష్ట్రానికి మాత్రమే విరాళాన్ని ప్రకటించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కల్కి సినిమాకు అత్యధిక కలెక్షన్లు వచ్చింది నైజాం ఏరియా నుంచే అని, కానీ పక్షపాతం చూపిస్తూ ఏపీకి మాత్రం విరాళం ఇవ్వడంలో ఆయన రాజకీయ లబ్ధి దాగివుందని విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications