తేజ సజ్జా సంచలన రికార్డు... ప్రభాస్, ఎన్టీఆర్ తర్వాత మూడో స్థానం
యంగ్ హీరో తేజ సజ్జా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రికార్డు ద్వారా ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత స్థానంలో నిలిచాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు కూడా వెనకబడ్డారు. హనుమాన్ తర్వాత విడుదలైన మిరాయ్ సినిమా కూడా విదేశాల్లో 2.5 మిలియన్ డాలర్లు రాబట్టింది. ప్రభాస్ సినిమాలు సలార్, కల్కి, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆర్ఆర్ఆర్, దేవర విదేశాల్లో ఈ మార్క్ సాధించాయి. తిరిగి ఈ మార్క్ అందుకున్న మూడో హీరోగా తేజ నిలిచారు.
ఎవరూ తొక్కేయకుండా ఉంటే చాలు
చాలా జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుంటూ, వాటిని పాన్ ఇండియా సినిమాలుగా మలుస్తూ కెరీర్ లో ముందుకు వెళుతున్న తేజ.. భవిష్యత్తులో మరో నాలుగు సినిమాలు ఇలాంటివే చేయగలిగితే స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకొని వారందరికీ సవాల్ విసిరే స్టేజ్ కు చేరుకుంటారు. ఈలోగా కొంతమంది తేజను తొక్కేయాలనే ప్రయత్నాలు చేయకుండా ఉంటే చాలు. భారీ బడ్జెట్లు అవసరం లేదు.. స్టార్ డైరెక్టర్లు అవసరంలేదు.. కథ బాగుంటే చాలు అని నమ్మి సినిమాలు చేస్తున్నందుకు తేజ సజ్జా మంచి ఫలితాలను రాబడుతున్నాడు.

ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన మిరాయ్ లో రితికా నాయక్, మంచు మనోజ్, శ్రియా, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఐదురోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టింది. రెండో వారంలో కూడా వసూళ్ల ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. తేజ, మనోజ్ మధ్య వచ్చే సన్నివేశాలు, గ్రాఫిక్స్, విజువల్స్ కు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారని చెప్పొచ్చు. విదేశాల్లో 2.5 మిలియన్ డాలర్లు దాటి 3 మిలియన్ డాలర్ల దిశగా పయనిస్తోందని చిత్ర బృందం ప్రకటించింది. హనుమాన్ కూడా 2.5 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది.












Click it and Unblock the Notifications