చిరంజీవి నిర్మాతగా, రజనీకాంత్ హీరోగా వచ్చిన ఏకైక సినిమా
మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్... ఇద్దరూ ముందుగా పరిశ్రమలో సహాయ నటులుగానే నటించారు. తర్వాత స్వయంకృషితో ఒకరు సూపర్ స్టార్ అయితే మరొకరు మెగాస్టార్ అయ్యారు. తన డ్యాన్సులు, ఫైట్లతో చిరంజీవి ప్రేక్షకులను అలరించగా, తన స్టైల్ తో రజనీకాంత్ తమిళ ప్రేక్షకులకు ఆరాధ్య దైవం అయ్యారు. కెరీర్ ప్రారంభంలో వీరిద్దరూ కలిసి కాళి, బందిపోటు సింహం లాంటి సినిమాలు చేశారు. తర్వాత స్టార్ హీరోలుగా మారడంతో కలిసి చేయడానికి వీలుపడలేదు. ఏడు పదుల వయసులో కూడా యువ హీరోలకు ధీటుగా సినిమాల్లో నటిస్తూ తమ నిబద్ధతను చాటుకుంటున్నారు.
తమిళంలో ఇండస్ట్రీ హిట్
చిరంజీవి, విజయశాంతి నాయకా నాయికలుగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు సినిమాను నిర్మించారు. సినిమాలకు విరామం ప్రకటించిన వాణిశ్రీ ఈ సినిమాతో తిరిగి పరిశ్రమలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇదే సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ తమిళంలో కూడా నిర్మించారు. అయితే ఈ సినిమాకు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించారు. రజనీకాంత్, అమల నాయకా నాయికలుగా నటించగా అత్త పాత్రను శ్రీవిద్య పోషించింది. ఈ సినిమా తమిళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. థియేటర్లలో ఏకధాటిగా 200 రోజులకు పైగా ఆడింది.

చిరంజీవి పేరు పెడితే క్రేజ్ పెరుగుతుందని..
వాస్తవానికి ఈ సినిమా అల్లు అరవింద్ నిర్మించాలనుకున్నప్పటికీ చిరంజీవికి, రజనీకాంత్ కు మధ్య ఉన్న స్నేహంతోపాటు చిరంజీవి పేరును వాల్ పోస్టర్ పై పెడితే క్రేజ్ పరంగా కూడా కలిసివస్తుందని భావించారు. దీంతో చిరంజీవి ఓకే అనగానే సమర్పకుడిగా చిరంజీవి పేరు వేశారు అల్లు అరవింద్. అంతే కాకుండా ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో అతిథి పాత్రలో చిరంజీవి కనిపిస్తారు. అలా చిరంజీవి నిర్మాతగా రజనీకాంత్ కథానాయకుడిగా రూపుదిద్దుకున్న ఏకైక చిత్రంగా 'మాపిళ్లై'నిలిచింది. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాకు తమిళంలో 'మాపిళ్లై'అని పేరు పెట్టారు. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చేస్తుండగా, రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications