సీఎం విజయ్ లైన్ దాటిన ఎమ్మెల్యే!.. ఆ ఒక్క 'రీల్' తెచ్చిన ముప్పు!
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ముఖ్యంగా అక్కడ 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సరికొత్త రాజకీయ ఒరవడి కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతం అధికార పార్టీలోనే అంతర్గతంగా ఒక పెద్ద దుమారం రేగుతోంది. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్ఠను పెంచేందుకు అధినేత, ముఖ్యమంత్రి విజయ్ అహర్నిశలు శ్రమిస్తుంటే.. మరోవైపు కొందరు ప్రజాప్రతినిధుల అత్యుత్సాహం సొంత ప్రభుత్వానికే తలనొప్పిగా మారుతోంది. స్వయంగా ముఖ్యమంత్రే విధించిన లక్ష్మణ రేఖను ఓ ఎమ్మెల్యే దాటడం ఇప్పుడు కోలీవుడ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
సీఎం విజయ్ లైన్ దాటిన ఎమ్మెల్యే!
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో ప్రజాప్రతినిధులు హడావుడి చేయకూడదని, ముఖ్యంగా ప్రచారం కోసం రీల్స్, వీడియోలు చేస్తూ విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగించవద్దని ముఖ్యమంత్రి విజయ్, విద్యాశాఖ మంత్రి రాజ్మోహన్ ఇటీవలే పార్టీ శ్రేణులకు గట్టి క్లాస్ పీకారు. నాయకులంతా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ ఆదేశాల తాలూకు సిరా ఆరకముందే ధర్మపురి జిల్లా పెన్నగరం ఎమ్మెల్యే గజేంద్రన్ సీఎం మాటను పక్కనబెట్టేసి తనదైన శైలిలో చక్రం తిప్పారు.

పెన్నగరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు వెళ్లిన ఎమ్మెల్యే గజేంద్రన్.. అక్కడ పెద్ద ఎత్తున హడావుడి చేశారు. తరగతి గదుల్లోకి కెమెరాలతో దూసుకెళ్లడమే కాకుండా, మధ్యాహ్న భోజన వంటశాలను పరిశీలిస్తూ వాటిని షూట్ చేయించారు. అంతటితో ఆగకుండా.. పెరుంపాళై ప్రాంతంలో కలుషిత ఆహారం తిని ఆస్పత్రిలో చేరిన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు కూడా ఆ సీన్లను కెమెరాలో బంధించి, సోషల్ మీడియాలో 'రీల్స్' రూపంలో వదిలారు. సీఎం విజయ్ వద్దని చెప్పిన పబ్లిసిటీ స్టంట్ను సొంత ఎమ్మెల్యేనే చేయడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
విద్యార్థుల చదువులతో చెలగాటమా? విమర్శల జల్లు!
ఎమ్మెల్యే చేసిన ఈ రీల్స్ వ్యవహారంపై విద్యావేత్తలు, ప్రతిపక్షాలు ఒక్కసారిగా విరుచుకుపడుతున్నాయి. ప్రజాప్రతినిధులు తనిఖీలు చేయడం మంచిదే అయినప్పటికీ.. ఇలా కెమెరాల హడావుడితో క్లాస్ రూమ్లలోకి వెళ్తే విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆర్డర్స్ను అధికార పార్టీ ఎమ్మెల్యేనే గాలికొదిలేస్తే, ఇక సామాన్యులకు ఏం సందేశం ఇస్తారని విపక్షాలు గట్టిగా నిలదీస్తున్నాయి.
గతంలో కూడా టీవీకేకు చెందిన కొందరు నేతలు ఇలాంటి అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు అధిష్ఠానం తీవ్రంగా హెచ్చరించింది. కానీ ఈసారి ఏకంగా ఓ శాసనసభ్యుడే రూల్స్ బ్రేక్ చేయడంతో తమిళ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. క్రమశిక్షణకు మారుపేరైన సీఎం విజయ్.. తన మాటను జవదాటిన పెన్నగరం ఎమ్మెల్యే గజేంద్రన్పై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications